బెల్లంపల్లి, అక్టోబర్ 19: నిరంతరం ప్రజల మధ్య ఉండే తనకు ప్రజలే తన బలమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాలోని ఏఆర్ కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించిన బెల్లంపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ వెంకటేశ్ నేతకాని, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ విజయ్ ఆనంద్తో కలిసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో డబ్బుల సంచులతో వచ్చే నాయకులపై విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
365 రోజులు, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని తనను ఆదరించాలని కోరారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, తనను ప్రజలు ఆశీర్వదించే విధంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసే తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో తొమ్మిదేండ్లుగా చేసిన అభివృద్ధిని ఇంటింటా తెలియజేయాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను అందరికీ వివరించాలని తెలిపారు. ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ ఎన్నికల్లో చిన్నయ్యను గెలుపు నిర్ణయించే శక్తి సోషల్ వారియర్స్దేనని, ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలన్నారు.
సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ విజయ్ఆనంద్ మాట్లాడుతూ సోషల్ మీడియాను ఏ విధంగా వినియోగించుకోవాలో వారియర్స్కు దిశానిర్ధేశం చేశారు. బీజేపీ పార్టీ అవసరం లేని విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నదని సమర్థవంతంగా ఎదుర్కోవాలని వివరించారు. అత్యంత దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని 60 ఏండ్ల పాలనతో తెలంగాణను ఆగం చేసిందన్నారు. ప్రతి పక్షాలకు ఎందుకు ఓటు వేయద్దో ప్రజలకు సమగ్రంగా వివరించాలని వెల్లడించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ అని విమర్శించారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ప్రతిపక్షాలు బెల్లంపల్లిలో మహిళను అడ్డం పెట్టుకుని ఆంధ్ర రాజకీయాలు చేశారని ఆరోపించారు. గడ్డం వినోద్ సోషల్ మీడియాలో అశ్లీల చిత్రాలు పోస్టు చేసి అభాసుపాలైనప్పుడే ఆలస్యమైన ధర్మం గెలుస్తుందనే విషయం స్పష్టం అయిందని వివరించారు. చిన్నయ్య గెలుపునకు సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందాలంటే మూడవ సారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత సోషల్ వారియర్స్పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన సోషల్ మీడియా వారియర్స్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యూత్ నాయకులు పాల్గొన్నారు.