అధికారుల నిర్లక్ష్యం ఆ ఊరి ప్రజలకు శాపంగా మారింది. ‘మిషన్ భగీరథ’ మోటర్కు మరమ్మతు చేపట్టకపోవడంతో తాగు నీటికి తిప్పలు పడాల్సి వస్తున్నది. పక్షం రోజులుగా పక్కనున్న గూడేనికి వెళ్లి బిందెల్లో నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొనగా, పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గిరిజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
– జన్నారం, మార్చి 12
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలోనున్న లోతొర్రె గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఇక్కడ 60 కుటుంబాలుండగా, 200 జనాభా ఉంది. కేసీఆర్ సర్కారులో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీరందుతున్నది. పక్షం రోజుల క్రితం మోటర్ కాలిపోగా, అధికారులు పట్టించుకోకపోవడంతో గుక్కెడ నీటి కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తున్నది. పక్కనే ఉన్న అగూడెంలో ఉన్న బోరు బావుల వద్దకు కాలినడకన వెళ్లి తాగు నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ గోస తీర్చాలని వేడుకుంటున్నారు.
మోటర్ను రిపేరుకు పంపినం..
మిషన్ భగీరథకు ఉపయోగించే విద్యుత్ మోటర్ చెడిపోయింది. ఆ మోటర్ కొన్నప్పుడు కంపెనీ గ్యారంటీ ఇచ్చింది. సంబంధిత డీలర్ వద్దకు పంపించినం. అది రిపేరై వచ్చిన వెంటనే అమర్చి నీటిని సరఫరా చేస్తాం. అప్పటి వరకు గ్రామస్తులు సహకరించాలి.
– రమేశ్, పంచాయతీ కార్యదర్శి
నీరు సరఫరా చేయాలి..
మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. మోటర్ పాడైపోయిందని చెబుతున్నరు. మహిళలు నీళ్ల కోసం ఇబ్బందులుపడుతున్నరు. మూగ జీవాలకూ నీరు దొరకడం కష్టంగా ఉంది. అధికారులు వెంటనే స్పందించి మోటర్కు మరమ్మతు చేయించి తాగు నీరు సరఫరా చేయాలి.
– బోడ శంకర్, మాజీ ఉపసర్పంచ్, లోతొర్రె
మోటర్ మంచిగ చేయించాలె..
కేసీఆర్ సర్కారు మిషన్ భగీరథ పథ కం తీసుకొచ్చి మా తాగు నీటి తిప్పలు తీర్చింది. ఇప్పటి దాకా రంది లేకుంట ఇంటింటికీ నీళ్లచ్చినయి. ఇప్పుడు మోటర్ పాడైందని చెబుతున్నరు. అసలే ఎండాకాలం. మహిళలు నీళ్ల కోసం బోరు బావుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే మోటర్ను మంచిగ చేయించి నీళ్లందించాలి.
– కుర్సింగు గంగారాంపటేల్, గ్రామ పెద్ద