ప్రగతి ప్రదాత, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం (అక్టోబర్ 1న) మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో పర్యటించనున్నారు. చెన్నూర్ నియోజకవర్గానికి మొదటిసారి వస్తున్న ఆయన చరిత్రలో నిలిచిపోయేలా రూ.735.73 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం క్యాతన్పల్లిలోని స్వగృహంలో, మందమర్రి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎన్నికల సమన్వయ సమితి సభ్యులు, కార్యకర్తలతో విప్ బాల్క సుమన్ సమావేశమై.. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేలా పలు సూచనలు చేశారు. కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కాగా, గాంధారీ వనంలోని 250 ఎకరాల్లో రూ.50 కోట్లతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయనున్న కేసీఆర్ అర్బన్ ఎకో పార్కుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పెట్టడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
– మంచిర్యాల ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/ మందమర్రి, సెప్టెంబర్ 29
మంచిర్యాల ప్రతినిధి(నమస్తే తెలంగాణ/ మందమర్రి, సెప్టెంబర్ 29 : మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో ‘ప్రగతి’ పండుగకు సమయం వచ్చింది. అక్టోబర్ 1న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ రెండు మున్సిపాలిటీల్లో పర్యటించనున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో తొలిసారి పర్యటనకు వస్తున్న ఆయన చరిత్రలో నిలిచిపోయేలా రూ.735.73 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మందమర్రి మండలం శంకర్పల్లిలో రూ.500 కోట్లతో నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీకి మంత్రి భూమి పూజ చేస్తారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 250 ఎకరాల్లో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా రూ.50 కోట్లతో అభివృద్ధి చేయనున్న కేసీఆర్ అర్బన్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. రెండు మున్సిపాలిటీల్లో రూ.44.84 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 846 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు.
మందమర్రిలో 13 వేల ఇండ్లకు తాగునీరు అందించే మిషన్ భగీరథ అర్బన్ పనులు సహా సైంట్రల్ లైటింగ్, మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపన, భూమి పూజల్లో పాల్గొంటారు. రూ.22.90 కోట్లతో మందమర్రి పట్టణంలో తుది దశకు చేరుకున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు, రూ.35 కోట్లతో తుది దశకు చేరుకున్న క్యాతనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలిస్తారు. మందమర్రి పట్టణంలో రోడ్షో, అనంతరం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. ఈ మేరకు కలెక్టర్ బదావత్ సంతోష్, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ, ఫారెస్ట్, సింగరేణి, ఎన్హెచ్ఏఐ అధికారులందరూ సమన్వయంతో పని చేసి మంత్రి పర్యటనను విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రోడ్షో, బహిరంగ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం క్యాతన్పల్లిలోని తన స్వగృహంలో, మందమర్రి పట్టణంలోని పార్టీ ఆఫీస్లో మున్సిపాలిటీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎన్నికల సమన్వయ సమితి సభ్యులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. జన సమీకరణ, ఏర్పాట్లపై వారికి దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 50 వేల మందిని బహిరంగ సభకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి సైతం జనం రానున్నారు. మందమర్రి పట్టణంలో రోడ్షో నైపథ్యంలో డీసీపీ రామ్నాథ్ కేకన్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి వచ్చిన దగ్గరి నుంచి తిరిగి వెళ్లే వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.