రాష్ట్రంలోనే మారుమూల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మణిహారంగా మారనుంది. ఇప్పటికే బీడీఎన్టీ కంపెనీలో 150 మంది ఉద్యోగాలు చేస్తుండగా.. తెలంగాణ సర్కారు ఐటీ టవర్ నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. గతేడాది సెప్టెంబర్ 26న జిల్లా పర్యటనకు వచ్చిన ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ అమాత్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఐటీ టవర్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ మావల మండలంలోని బట్టిసావర్గాంలో మూడెకరాల స్థలం కూడా కేటాయించారు. 48వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించనుండగా.. 800 మంది ఇంజి నీర్లు, 200 మంది ఇతరులకు ఉద్యోగావకాశాలు లభించను న్నాయి. ఫలితంగా నిరుద్యోగ యువతకు ఐదంకెల జీతంతోపాటు స్థానికంగా, విదేశీయులతో కలిసి పనిచేసే అవకాశం లభించనుంది. ఇతర రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ)
నాలుగు నెలల క్రితం మంత్రి కేటీఆర్ హామీ
గతేడాది సెప్టెంబరు 26వ తేదీన ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ బీడీఎన్టీ ఐటీ కంపెనీని సందర్శించారు. పరిశ్రమ నిర్వాహకులు, ఉద్యోగులతో మాట్లాడారు. జిల్లాలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువత విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయడాన్ని కేటీఆర్ ప్రశంసించారు. ఉద్యోగుల సమావేశంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా ఐటీ టవర్ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి సూచనల మేరకు కలెక్టర్ స్థలాన్ని కేటాయించారు. టీఎస్ఐఐసీ అధికారులు స్థలాన్ని పరిశీలించి అనువుగా ఉందని నిర్ధారించారు. టవర్ నమూనా చిత్రాలను కూడా తయారు చేశారు.
స్థలసేకరణ, అధికారుల పరిశీలన అనంతరం ప్రభుత్వం నిర్మాణానికి అవసరమైన నిధులు రూ.40 కోట్లు మంజూరు చేసింది. 48 వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించే ఈ టవర్లో పలు కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. కొత్తగా నిర్మించే ఐటీ టవర్లో 800 మంది ఐటీ ఇంజినీర్లు, మరో 200 మంది ఇతర ఉద్యోగాలు లభించనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు ప్రభుత్వం ఐటీ టవర్ మంజూరు, నిధులు కేటాయించడం పట్ల జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ టవర్ నిర్మాణంలో భాగంగా త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభవుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు.
ఉన్న ఊర్లోనే ఐటీ జాబ్చేస్తా..
నేను హైదరాబాద్లో బీటెక్(ఈసీఈ) కంప్లీట్ చేసిన. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న. మా వద్ద ఇప్పటికే రన్ అవుతున్నటు వంటి బీడీఎన్టీ ఐటీ కంపెనీలో జాబ్ కోసం ప్రయత్నించా. ఇప్పుడు ప్రభుత్వమే ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని చూస్తున్నది. కేటీఆర్ సార్ ఇచ్చిన హామీ మేరకు రూ.40 కోట్లు సర్కారు మంజూరు చేసింది. ఇది శుభపరి ణామం. ఇక నేను హైదరాబాద్, బెంగళూరు, ఇతర దేశాలకు వెళ్లి జాబ్ చేయా ల్సిన అవసరం లేదు. ఉన్న ఊర్లోనే ఐదంకెల జీతంతో ఉద్యోగం చేస్తా. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులతో కలిసి ఉండి జాబ్ చేస్తా. వివిధ దేశాల కంపెనీలతో పనిచేస్తూ ప్రతిభను చాటుకునే అవకాశం దొరికింది.
– మమత, బీటెక్, ఆదిలాబాద్
టవర్ నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు
ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. రాష్ట్ర సర్కారు జిల్లా అభివృద్ధికి చేయూతనందిస్తుండడంతో ప్రగతిలో ఇతర జిల్లాలతో పోటీ పడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని జిల్లా కేవలం ఎనిమిదిన్నరేండ్లలో కనీవినీ ఎరుగనిరీతిలో దూసుకుపోతున్నది. హైదరాబాద్, బెంగళూరు, పూణె వంటి నగరాలకు పరిమితమైన ఐటీ కంపెనీలు ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తుండడంతో మారుమూల ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ కంపెనీలు ఏర్పాటు అవుతున్నాయి. ప్రభుత్వ సహకారంతో ఏడాది క్రితం బీడీఎన్టీ ఐటీ కంపెనీ ప్రారంభం కాగా.. ఇందులో 130 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని మావల మండలం బట్టి సావర్గాంలోని సర్వే నంబరు 72లో మూడెకరాల స్థలంలో ఐటీ టవర్ నిర్మాణాన్ని చేపట్టనుంది. అన్ని హంగులతో నిర్మించే ఈ టవర్కు ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది.
– ఆదిలాబాద్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ)
ఐటీ పరిశ్రమలతో అభివృద్ధి
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన జిల్లా అభివృద్ధి చెందింది. మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్లో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీలో 130 మంది ఉద్యోగాలు చేస్తుండగా.. కొత్తగా ప్రారంభించే టవర్లో 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇందులో 800 మంది ఇంజినీర్లు భారీ వేతనాలతో పనిచేస్తారు. ఐటీ పరిశ్రమల కారణంగా జిల్లాలోని ఇతర రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి.
– జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్.
800 మందికి ఉద్యోగాలు లభిస్తాయి..
రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధికి పెద్దపీట వేస్తున్నది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 90వేల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. నిరుద్యోగులు ప్రైవేటు పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించడానికి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాకు ఐటీ పరిశ్రమలు రావడం శుభపరిణామం. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్కు రూ.40 కోట్లు మంజూరు చేయడం హర్షించదగిన విషయం. ఆదిలాబాద్లో వివిధ ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశాలు ఉండడంతో 800 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
– సాయి కిరణ్, ఆదిలాబాద్.
ఐటీటవర్ నిర్మాణం గర్వకారణం
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ఆదిలాబాద్ జిల్లా ప్రగతిబాటలో పయనిస్తున్నది. గతంలో చదువులకు యువత ఉద్యోగాల కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలకు పోయి ఉద్యోగాలు చేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఐటీ పరిశ్రమలను విస్తరించడం, టవర్ను ఏర్పాటు చేయడం స్థానికులకు గర్వకారణం. చదువుకున్న యువత తాము ఉన్న ఊర్లోనే ఉద్యోగం చేయవచ్చు. వివిధ దేశాల కంపెనీలతో పనిచేస్తూ ప్రతిభను చాటుకునే అవకాశం దొరికింది. సొంత జిల్లాలో ఉద్యోగం చేస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఉండవచ్చు.
– నాగేంద్ర, బీటెక్, ఈసీఈ, ఆదిలాబాద్