దిలావర్పూర్ సెప్టెంబర్ 6 : ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేందుకే బ్యాంక్తో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుడికి రూ.లక్ష సాయం అందిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని సిర్గాపూర్ గ్రామంలో బుధవారం తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే మున్నూరుకాపు సంఘం, గురడిరెడ్డి సంఘ భవనాలను ప్రారంభించారు. అనంతరం రూ.25 లక్షలతో జిల్లాలోనే మోడల్ గ్రామ పంచాయతీగా నిర్మించిన జీపీ భవనాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి మాయపూర్ అనుబంధ గ్రామమైన ఓడ్డెపల్లిలో ఓడ్డెర సంఘ భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొని, మాట్లాడారు. రాబోవు రోజుల్లో ఇప్పుడున్న ఆసరా పింఛన్లను పెంచుతామని తెలిపారు. అలాగే రూ.99,999 లోపు రైతుల రుణాలను మాఫీ చేశామన్నారు. దివ్యాంగులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో పింఛన్ రూ.4016కు పెంచామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఉచిత విద్యుత్కు మంగళం పాడుతుందని, బీజేపీకి వేస్తే రైతుల మోటార్లకు మీటర్లు అమర్చుతుందని, అదే బీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే ఇప్పుడున్న 24 గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచితంగా 24 గంటల నిరంతర కరెంట్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని స్పష్టం చేశారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయడం చేతకాని ఆ పార్టీల నాయకులు, తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామనడం సిగ్గుచేటన్నారు. దీనిని ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవదాయ శాఖ మంత్రిగా 132 జీపీల్లో 900 ఆలయాలను నిర్మించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగారెడ్డి, ఎంపీపీ అక్షర, స్థానిక ఎంపీటీసీ రవీందర్రెడ్డి, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణాడ్డి, జడ్పీ కో-అప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్రావు, బీఆర్ఎస్ పార్టీ మండల్యాక్షుడు కొమ్ముల చిన్న దేవేందర్రెడ్డి, తహసీల్దార్ సరిత, ఎంపీవో అజీజ్ఖాన్, ఆర్ఐ సంతోష్, కాల్వ ఆలయ చైర్మన్ పూజారం మహేశ్, బీఆర్ఎస్ నాయకులు అల్లోల మురళీధర్రెడ్డి, పాల్ధె అనీల్, అడెపు శ్రీనివాస్, ఓడ్నం కృష్ణ, డైరెక్టర్ నర్సయ్య, కాల్వ నర్సారెడ్డి, నరసింహారెడ్డి, గంగారెడ్డి, గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జగదాంబాదేవి ఆలయ ప్రారంభోత్సవం..
సారంగాపూర్, సెప్టెంబర్ 6 : సారంగాపూర్ మండలం గోపాల్పేట్తండా నూతనంగా నిర్మించిన జగదాంబాదేవి ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు వల్లే పురాతన ఆలయాలకు పుర్వవైభవం తీసుకురావడం జరిగిందన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. జిల్లాలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, అడెల్లి పోచమ్మ వంటి బృహత్తర ఆలయాలకు నిధులు మంజూరు చేసి, కృష్ణశిలలతో నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. సుమారు 500కు పైగా దేవాలయాలకు నిధులు మంజూరు చేసి, ఆధునీకరించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రయంలో టీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్ రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, అడెల్లి పోచమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిటి చందు, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్యాదవ్, నాయకులు రాజ్మహ్మద్, గంగారెడ్డి, సర్పంచ్ రామారావు పాల్గొన్నారు.
కల్యాణ మండపం ప్రారంభం..
నర్సాపూర్ (జీ) సెప్టెంబర్ 6 : మండలంలోని రాంపూర్ గ్రామంలో గల రామాలయం వద్ద రూ.50 లక్షలతో నిర్మించిన కల్యాణ మండపాన్ని మంత్రి అల్లోల ప్రారంభించారు. ముందుగా యువకులు బైక్ ర్యాలీతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. అనంతరం వీడీసీ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆప్షన్ సభ్యులు సుభాష్ రావ్, పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, జడ్పీటీసీ చిన్న రామయ్య, ఎంపీటీసీలు మల్లేశ్, నడిపొల్ల రవి, పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి, వైస్ చైర్మన్ భోజన్న, సర్పంచ్ గోవింద్ రెడ్డి, ఆర్బీఎస్ కన్వీనర్ గోపిడి గంగారెడ్డి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, నవీన్, మండల సెక్రటరీ నారాయణ, శంకర్, శ్రీధర్రెడ్డి, పండితులు సంతోష్ పాల్గొన్నారు.
బీసీ కులవృత్తుల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ..
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 6 : మంత్రి క్యాంప్ కార్యాలయం లో నిర్మల్ నియోజకవర్గంలోని 20 మంది బీసీ కులాల లబ్ధిదారులకు మంత్రి అల్లోల రూ.లక్ష సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కష్టాలను తీర్చేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. నిరుపేదల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని ప్రజలకు ఉపయోడపడే పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్ ఎడిపెల్లి నరేందర్, మేడారం అపర్ణప్రదీప్ పాల్గొన్నారు.
మురళీ కృష్ణ ఆలయంలో పూజలు..
కృష్ణాష్టమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో గల గాంధీచౌక్ కాలనీ మురళీ కృష్ణ ఆలయంలో వేడుకలకు మంతిర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, కృష్ణాష్టమి వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ భక్తి భావంతో మెలగాలని సూచించారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కొనసాగుతున్నదని, వేల కోట్ల నిధులతో నూతన ఆలయాల నిర్మాణంతో పాటు నిరాదరణకు గురైన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక రమణ, జడ్పీ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ శుభాష్ రావు, నేళ్ల వేణు, పాకాల రాంచందర్, దేవరకోట ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీధర్, మురళీ కృష్ణ ఆలయ చైర్మన్ పొలిశెట్టి కిషన్, ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన బోథ్ న్యాయవాదులు..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని నిర్మల్ జిల్లాలోని తన నివాసంలో బోథ్ బార్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. బోథ్ కోర్టు బిల్డింగ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, అన్ని విధాలుగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ పంద్రం శంకర్, న్యాయవాదులు ఆడెపు హరీశ్, కుమ్మరి విజయ్కుమార్ పాల్గొన్నారు.