రాష్ట్ర సర్కారు ఉపాధి మెరుగుపర్చడంతో మత్స్యకారులు మస్తు ఖుషీ అవుతున్నారు. ఏడేండ్లుగా వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తుండడంతో నీలి విప్లవం వెల్లివిరుస్తున్నది. కులవృత్తులకు చేయూతను ఇవ్వాలనే ఉద్దేశంతో 2016 సంవత్సరం నుంచి మత్స్యకారులకు చేప విత్తనాలను నిరంతరాయంగా ఇస్తున్నది. యేడాది పొడవునా చేపలను విక్రయిస్తూ మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. ఈ యేడాది జూలైలోనే వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చేప పిల్లలను వదలడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,478 చెరువుల్లో 9.58 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రణాళికలు రూపొందించారు. తాజాగా మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్వర్ణ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు.
– మంచిర్యాల, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జూలైలో ఏకధాటిగా కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. యేటా రాష్ట్ర సర్కారు చెరువుల్లో వదలడానికి ఉచితంగా చేపపిల్లలను ఇస్తుండడంతో మత్స్యకారులు మస్తు ఖుషి అవుతున్నారు. సమాఖ్య పాలకులు మత్స్యకారులను విస్మరించగా.. తెలంగాణ సర్కా రు పెద్దపీట వేస్తున్నది. కులవృత్తులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో 2016లో ప్రారంభించిన చేపపిల్లల పంపిణీ.. ఇప్పటికీ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. గడిచిన ఏడేళ్లలో వదిలిన చేపపిల్లలు సిరు లు కురిపించాయి. మత్స్యకారులకు ఏడాది పొడువునా ఉపాధి దొరుకుతోంది. చేపల లభ్యత పెరిగి మత్స్యరంగం బాగుపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే గడిచిన ఏడేండ్లలో ఆర్థికంగా చితికిన మత్స్యకార కుటుంబాలకు సర్కారు పెద్దన్నలా ఆదుకుంటోంది. ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడమే కాకుండా పట్టిన చేపలను ఊరూరా తిరిగి అమ్ముకునేందుకు మోపెడ్స్, బొలేరో వాహనాలు, మార్కెట్లో చేపలు అమ్ముకునే మత్స్యకారులకు టెంట్లు, తరాజు, ఐస్ బాక్సులు, ఇతర పరికరాలను అందజేసింది. ఇప్పుడు మరోసారి చేపపిల్లలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏ జిల్లాలో ఎలా..
మంచిర్యాల జిల్లాలో 371 చెరువుల్లో 2.20 కోట్ల చేప పిల్లలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఇవీ కాకుండా ఎల్లంపల్లి, సుందిల్ల, అన్నారం, గొల్లవాగు, నీల్వాయి, రాళ్లవాగు, పెద్దపేట పెద్ద చెరువు, నల్లవాగు ప్రాజెక్టుల్లోనూ చేపపిల్లలను వేయనుంది. నిర్మల్ జిల్లాలో 613 చెరువుల్లో 4.70 కోట్ల చేపపిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఎస్సారెస్సీ, కడెం, స్వర్ణ, గడ్డెన వాగు ప్రాజెక్టుల్లోనూ చేపలు వదలనుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 245 చెరువుల్లో 67.82 లక్షలు, కుమ్రం భీం, వట్టివాగు, పీపీ రావు, ఎన్టీఆర్ ప్రాజెక్టు, మరో 11 పెద్ద చెరువుల్లో 78 లక్షల చేప పిల్లలను వేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 238 చెరువులు, సత్నాల-మత్తడివాగు ప్రాజెక్టుల్లో 1.23 కోట్ల చేపపిల్లలను వదలనున్నారు. ఇందులో గ్రామ పంచాయతీల పరిధిలోని, మత్స్యశాఖ పరిధిలోని చెరువుల్లో 35 మిల్లీ మీటర్ల నుంచి 40 మిల్లీ మీటర్ల పొడవు గల చేప పిల్లలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో 80 మిల్లీ మీటర్ల నుంచి 100 మిల్లీ మీటర్ల పొడవున్న చేప పిల్లలను వేయనున్నారు.
వేలాది కుటుంబాలకు ఆధారం..
ప్రభుత్వ చేప పిల్లల పంపిణీ వేలాది మత్స్యకార కుటుంబాలకు ఆదాయం తెచ్చిపెడుతున్నది. గతంలో ఏడాదిలో రెండు నెలలో చేపల వేట చేస్తూ మిగిలిన సమయాల్లో వేరే పనులు చేసుకునే మత్స్యకారులు కొన్నేళ్లుగా రెండు, మూడు నెలలు తప్ప ఏడాది పొడవునా చేపల వేటకు వెళ్తున్నారు. నిర్మల్లో 12,200 మంది, ఆదిలాబాద్లో 4,200, మంచిర్యాలలో 6,499, ఆసిఫాబాద్లో 2500 మంది మత్సకారులు ఈ చేపల పంపిణీ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికే చేప పిల్లల పంపిణీని ప్రారంభించామని స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని చెరువులో చేపపిల్లలు వదులుతామని అధికారులు చెబుతున్నారు.
ఉన్న ఊళ్లోనే ఉపాధి
నెన్నెల, ఆగస్టు 29: నాడు ఉపాధి కోసం కుటుంబాన్ని, ఉన్న ఊరును వదిలి గోదావరి పొంట పోయేటోళ్లం. నదీ తీరంలో ఉంటూ పట్టిన చేపలను అమ్ముకొని బతికే టోళ్లం. తెలంగాణ వచ్చినంక మా ఇబ్బం దులన్నీ పోయినయ్. మిషన్ కాకతీయతో చెరువులన్నీ బాగైనయ్. ప్రతి చెరువులో ఉచితంగా చేప పిల్లలను వేసి, వాటిని పట్టుకునే హ క్కు మాకు ఇచ్చిన్రు. దీంతో ఉన్న ఊళ్లోనే ఉపాధి పొందుతూ సంతోషంగా ఉంటున్నం. చేపల్ని అమ్ముకునేందుకు బండ్లను కూడా సర్కారోళ్లు ఇచ్చిన్రు. ఇప్పుడిప్పుడే మా బతుకులు మారుతున్నయ్.
-భీమిని శంకర్, మత్స్యకారుడు
ఏడాదంతా ఉపాధి
నిర్మల్ టౌన్, ఆగస్టు 29: చేపలు పట్టే వృత్తి తప్ప మాకు ఏ పని రాదు. చెరువులు నిండి తే ఎంతో సంతోషంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ వచ్చాక మిషన్ కాకతీయ ద్వా రా చెరువుల్లో మట్టి తీయడంతో వర్షాలు కురిసి నిండు తున్నాయి. ప్రభుత్వం మత్స్య కార్మికులకు వందశాతం సబ్సిడీపై ప్రతియేటా చేప పిల్లలను ఉచితంగా అంది స్తోంది. జూలై, ఆగస్టులో చేప పిల్లలను చెరువుల్లో వేస్తే సెప్టెంబర్ నాటికి కేజీ నుంచి 2 కేజీల వరకు పెరగడం వల్ల ఆ చేపలు పట్టుకొని తాము ఉపాధి పొందుతు న్నాం. గతంలో మూడు నెలలు మాత్రమే చేపలు పట్టడం వల్ల ఉపాధి దొరికేది. ఇప్పుడు ఏడాదంతా చేపలు దొరకడం వల్ల మాకు పూర్తి భరోసా ఏర్పడింది.
-టీ పోశెట్టి, మత్స్యకార్మికుడు, కౌట్ల (బి)
మత్స్యసంపదతోనే మా జీవితం
ఎదులాపురం, ఆగస్టు 29: గతంలో మేము ఒర్రె (వాగు),పెన్గంగలో జిమ్మలు(చేపలు) పట్టి కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. గతంలో పోటీ పడి మరి చేపలు పట్టేటోళ్లం. దీంతో ఒక్కోరోజు దొరికేటియి కాదు. ఇగ ఇంట్ల పస్తులు తప్పేటియి కాదు. ఎప్పుడయితే తెలంగాణ సర్కారు అచ్చిందో అప్పటి నుంచి మా బతుకులు మారినయ్. మా గ్రామంలో కూడా అప్పట్ల మోపెడ్లు ఇచ్చిన్రు. మా దగ్గరున్న రాజులవాడి చెరువును పునరిద్ధరించిన్రు. ఏటా అండ్ల చేపపిల్లలను సర్కారే వేస్తున్నది. గా సంపదతోనే మేము రోజుతప్పి రోజు చేపలు పట్టుకుంటున్నం. ఇప్పుడు చేపలమ్మి రోజుకు రూ.500 నుంచి రూ. 800 దాకా సంపాదిస్తున్నం. మా బతుకులు మార్చిన సీఎం కేసీఆర్ సారు మేలు మర్చిపోం.
– భావునె తానాజీ, మత్స్యకారుడు, కరంజి(టి), భీంపూర్
సీఎం సారుతోనే మా బతుకులల్ల ఎలుగు
ఎదులాపురం, ఆగస్టు 29: ఒకప్పుడు వాగులల్ల చేపలు దొర్కక మస్తు బాధ అనిపిస్తుండె. ఇపుడు రాజులవాడి చెరువు అనేది మాకు మండు ఎండాకాలం కూడా నిండ నీటితో చేపల సంపదతోని ఉంటున్నది. ఇగ మాకు ధైర్యం అచ్చింది. మా గ్రామంల మా కుటుంబాలన్నీ తెలంగాణ సర్కారు అచ్చినంకనే మంచిగ బతుకుతు న్నయ్. సీఎం కేసీఆర్ సారు మత్స్యకారులకు అన్ని రకాల భద్రత కల్పించిన్రు. రాజులవాడి చెరువును గనుక పునరుద్ధరించకుంటే ఇప్పుడు చేపల పెంపకం ఉండేది కాదు. మా సర్పంచ్, చేపపిల్లలను యాటా చెరువుల వేసేలా సంపద పెరిగేలా శ్రద్ధ తీసుకుంటున్నరు. సీఎం కేసీఆర్ సారు వలనే మా పేద బతుకులకు ఎలుగు అచ్చింది. మేము ఎన్నటికీ బీఆర్ఎస్, సీఎం సారును మర్చిపోం.
– ఇప్ప లక్ష్మణ్ ,మత్స్యకారుడు ,కరంజి(టి), భీంపూర్ మండలం
కేసీఆర్తోనే మా బతుకులు
నిర్మల్ టౌన్, ఆగస్టు 29: 30 ఏళ్ల సంది చేపలు పడుతున్న. గతంలో చేపలు పట్టాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. తెలంగాణ రాకముందు ప్రభుత్వం సబ్సిడీ వలలు మాత్రమే ఇచ్చేది. తెలంగాణ వచ్చాక వలలతో పాటు తెప్పలు, చేపలు పట్టి విక్రయించేందుకు మొబైల్ వాహనాలను ఇస్తున్నది. ఇప్పుడు మేము పట్టిన చేపలను ఊర్లోకి వెళ్లి అమ్ముకుంటున్నం. గతంలో ఒకే ఊర్లో చేపలు అమ్మడానికే కాలం సరిపోయేది. ఇప్పుడు వాహనం ఉండడం వల్ల పది ఊర్లు తిరిగి మాకు నచ్చిన రేటుకు చేపలు అమ్ముకుంటున్నం. ఇట్ల రోజుకు రూ. వెయ్యి మిగులుతున్నయి.
-బట్టు పోశెట్టి, మత్స్య కార్మికుడు, స్వర్ణ