గర్భిణులు ఆరోగ్యంగా ఉండేందుకు, రక్తహీనతను నివారించడానికి, పౌష్టికాహారం అందించడానికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ వరంగా మారాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో బుధవారం న్యూట్రిషన్ కిట్స్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లతో కలిసి మంత్రి, విప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. వైద్యం, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. సర్కారు తీసుకుంటున్న చర్యలతో మాతా, శిశు మరణాలు చాలా తగ్గాయన్నారు.
ఆదిలాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : నిరుపేదలకు అన్ని రకాల వైద్యసేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వము పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గర్భిణులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి కిట్స్ పంపిణీ చేశారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని.. ఇందులో భాగంగా కేసీఆర్ కిట్స్ ద్వారా గర్భిణులకు రూ.15 వేల ఆర్థిక సాయం అందుతుందన్నారు.
గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించడానికి టిఫా యంత్రాలను ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అమ్మఒడి అంబులెన్స్ల ద్వారా గర్భిణులకు వైద్యం పొందేలా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రసవాలు చేసిన వైద్యసిబ్బందికి రూ.3 వేల పారితోషికం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలిపారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో రక్తహీనతతో గర్భిణులు బాధపడుతున్నారని.. ఇందులో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయన్నారు. గతంలో లక్షకు 98 శాతం ఉన్న మాతృమరణాల రేటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాగా తగ్గాయని, ప్రసూతి మరణాలు కూడా తగ్గించడంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు.
న్యూట్రిషన్ కిట్స్తో రక్తహీనత నివారణ
తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఫలితంగా గర్భిణులు ఆరోగ్యంగా ఉండడంతోపాటు రక్తహీనత నివారణ, పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. గర్భిణులకు రెండు విడుతల్లో కిట్స్ పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. కిట్లో ఉండే పౌష్టికాహారం, మందులను గర్భిణులు క్రమంగా వాడి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. వైద్య సిబ్బంది కిట్ల వినియోగం పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నటరాజ్, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆర్డీవో రమేశ్ రాథోడ్ పాల్గొన్నారు.
తల్లి ఆరోగ్యమే ముఖ్యం
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 21: పుట్టబోయే బిడ్డ బాగుండాలంటే తల్లి ఆరోగ్యమే ముఖ్యం. మంచి ఆహారం తీసుకోకపోతే ప్రసవానికి చాలా ఇబ్బం దులు ఎదురవుతాయి. అందుకే సీఎం కేసీఆర్ ఈ న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నరు. వీటిని బయట మార్కెట్లో కొనాలంటే పేదింటి బిడ్డలకు కష్టం. అందుకే ప్రభుత్వం వీటిని ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడందిస్తున్న కిట్లు తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తహీనత లాంటి సమస్య ఉన్న వారికి పౌష్టికాహారం తప్పనిసరి. ఎన్నో పేద కుటుంబాల ఆడబిడ్డలకు ఇది ఉపయోగపడుతది. మాకు కూడా ఇయ్యాల న్యూట్రిషన్ కిట్ ఇచ్చిన్రు. చాలా సంతోషంగా ఉంది.
– ఉజ్మా మెరోష్ మహమ్మద్ అక్బర్, ఖానాపూర్ ఆదిలాబాద్