భైంసా, జనవరి 17 : క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో బీపీసీఎల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ క్రికెట్ పోటీలతో స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపడుతాయన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం విజేత భైంసా జట్టుకు కప్, రూ.21 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన బెల్గాం జట్టుకు బహుమతి అందజేశారు. ముందుగా ఎస్పీ ప్రవీణ్కుమార్, మంత్రి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కిరణ్ ఖారే, నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు వినోద్, చంద్రశేఖర్, ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు జేకే పటేల్, సోలంకి భీంరావు, బామ్ని రాజన్న, పిప్పెర కృష్ణ, ఫారూఖ్, ఆళా, నిర్మల్ ఎస్బీ సీఐ రమేశ్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, తదితరులున్నారు.
సారంగాపూర్ మండలం చించోలి (బీ) పరిధిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో రూ.45 లక్షలతో చేపట్టనున్న భవన మరమ్మతు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో ముందుడాలన్న సంకల్పంతో అనేక సంక్షమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. చించోలి(బీ) మహిళా ప్రాంగణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంతో మంది మహిళలు వివిధ రకాల కోర్సులను పూర్తి చేసి, ఉద్యోగాల్లో రాణిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని మేనేజర్ విజయలక్ష్మి మంత్రి దృష్టికి తీసుకురాగా, ఆయన స్పందించి వెంటనే ప్లాంట్కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ చాట్ల లక్ష్మి, ఎంపీటీసీ వెంకటరమణారెడ్డి, ఉప సర్పంచ్ పోశెట్టి, ప్రాంగణం సిబ్బంది పాల్గొన్నారు.