కాలం మారుతున్నది.. ఆధునిక సమాజం కొత్తదనాన్ని కోరుకుంటున్నది. ఎక్కడికి వెళ్లాలన్నా, ఇంటి నుంచి కాలు బయటకు పెడితే చాలు.. వివిధ రూపాల్లో వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా ఆదివాసీ గిరిజనం తమ ఆరాధ్య దైవం నాగోబాకు జలాభిషేకం చేసేందుకు కాలినడకనే బయల్దేరారు. తమ సంస్కృతిని భావితరాలకు అందించాలనే ఏకైక లక్ష్యంతో ఆనాటి నుంచి నేటి వరకు పవిత్ర గంగాజలం సేకరణ కోసం వందల కిలోమీటర్లు కాలినడకనే వెళ్తున్నారు. రాళ్లు, వాగులు, వంకలు, దట్టమైన అటవీ ప్రాంతాలు, గుట్టలు దాటుతూ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. 143 మంది మెస్రం వంశీయులు సుమారు 220 కిలోమీటర్ల వరకు పాదయాత్రగా వెళ్లి మంచిర్యాల జిల్లాలోని గోదావరి నది హస్తలమడుగు నుంచి పవిత్రమైన జలాలను ఝరిలో సేకరించి నాగోబా ఆలయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో దైవంపై ఉన్న నమ్మకమే తమను నడిపిస్తున్నదని, భావితరాలకూ ఈ సంప్రదాయాన్ని అందిస్తామని మెస్రం వంశీయులు చెబుతున్నారు. తమ నమ్మకం.. సంస్కృతి.. ఆచారాలు వారి మాటల్లోనే..
-ఇంద్రవెల్లి, జనవరి 8
గంగాజలం సేకరణకు చేపట్టిన పాదయాత్రను మా దైవమే ముందుండి నడిపిస్తున్నది. మా మేన్ ప్రధాన్ మెస్రం తుకుడోజీ మృతి చెందడంతో, మా పెద్దలంతా కలిసి నాకు మేన్ ప్రధాన్గా బాధ్యతలు అప్పగించిన్రు. అప్పటి నుంచి నేను నాగోబా మహాపూజలతోపాటు గంగాజలం సేకరణ పాదయాత్ర, అన్ని కార్యక్రమాల్లో బాధ్యతగా ఉంటున్న. పాదయాత్రలో నేను ముందు నడిస్తే, మిగతా అందరూ నా వెనుకే వస్తుంటారు. 18 ఏండ్లుగా ఇలా గంగాజలం సేకరణ పాదయాత్రలో పాల్గొంటున్న. నేను రెండేళ్లుగా ప్రధాన్ కితకు మెయిన్ పర్ధాంజీగా వ్యవహరిస్తున్నా. గాయన్ రూపంలో నాగోబా చరిత్రను కూడా మెస్రం వంశీయులకు చెబుతుంట.
-పర్ధాంజీ మెస్రం దాదారావ్, గుండాల(నార్నూర్)
నాగోబాకు నిర్వహించే మహాపూ జలకు ఉపయోగించే గంగాజల సేకరణ పాదయాత్రలో నడిచేందుకు అవకాశం రావడం ఇది రెండో సారి. గతంలో చాలాసార్లు ప్రయత్నించినా అవకాశం రాలేదు. ఎన్నో నియమాలతో కూడిన పాదయాత్ర చేయడం గర్వంగా ఉంది. నాగోబా ఆశీస్సులు మా కుటుంబానికి ఉంటా యనే ఈ పాదయాత్రలో పాల్గొంటున్న. చాలా సంతోషంగా ఉంది.
-మెస్రం దేవ్రావ్, చించుఘాట్ (ఆదిలాబాద్)
గంగాజలం సేకరణ పాద యాత్రలో పాల్గొనడమనేది నా ఆశ. ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్న. చాలా రోజులకు అవకాశం వచ్చింది. రెండేళ్లుగా ఈ పాదయాత్రలో పాల్గొంటున్న. నా కోరికను నాగోబా దేవత నెరవేర్చింది. నేను మొక్కిన మొక్కులను తీర్చుకుంటున్న. నాగోబా ఆశీస్సుల కోసమే ఈ పాదయాత్రలో పాల్గొంటున్న. నేను పాదయాత్రలో పాల్గొనడం మా ఇంటిల్లిపాదికి ఎంతో ఇష్టం.
-చిన్ను, ఆద్మియన్(గాదిగూడ)
గంగాజలం సేకరణ పాదయాత్రలో పాల్గొంటే మనసులో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మాకందరికీ నాగోబా ఆరాధ్య దైవం. ఆ తల్లికి అభిషేకించేందుకు గంగా జలం తేవడానికి వెళ్లడం ద్వారా నా జన్మ ధన్యమైంది. ఆ దేవత అనుగ్రహంతోనే నేను 12 ఏండ్ల సంది ఈ పాదయాత్రలో పాల్గొంటున్న. మా సంప్రదాయాలు భావితరాలకు అందించడమే మా లక్ష్యం. సమాజంలో అందరూ సుఖసంతోషాలతో గడపడమే మాకు కావాల్సింది.
-మెస్రం కేశవ్రావ్, గాదిగూడ(హిరాపూర్)
ఇది మా సంస్కృతి. మా నుంచి దూరం కాదు. మా తరానికి కూడా అందించాలనేది మా పెద్దల కోరిక. ఇది మా జీవితాల్లో భాగం. పాదయాత్ర కారణంగా మా ఆరోగ్యం కూడా బాగుంటుంది. నాగోబా ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉంటాయి. చిన్న వయసులోనే నాకు ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇది ఆ దేవత వరంగా భావిస్తున్నా. మరి కొన్నేండ్లు ఇలా పాదయాత్రలో పాల్గొనే అవకాశం రావాలని ఆ దేవతను కోరుకుంటున్న.
-మెస్రం గోపాల్, కెస్లాగూడ (ఇంద్రవెల్లి)
గంగాజలం సేకరణ కోసం బయలుదేరిన పాదయాత్ర బృందానికి మధ్యలో ఎవరూ అడ్డు రాకుండా చూస్తుంటాను. నేను 40 ఏండ్ల నుంచి పాదయాత్రలో వెళ్తున్నా. నేను వెనుకాల నడుస్తుంట. ఇతరులు పాదయాత్ర మధ్యలోకి రాకుండా చూసే బాధ్యత నాది. ముందు నడిచే ప్రధాన్ను నిత్యం గమనిస్తూ వరుస క్రమంలో అందరినీ నడిపిస్తుంట. నాగోబాకు మహాపూజలతోపాటు జాతర పూర్తిగా ముగిసే వరకు వాజేకర్ బృందంలో ప్రధాన వాజంత్రేగా వ్యవహరిస్తుంట.
-మెస్రం గణపతి, బాబేఝరి (నార్నూర్)
25 ఏండ్లుగా గంగాజల సేకరణ పాదయా త్రలో పాల్గొంటున్న. ప్రస్తుతం మెయిన్ కటోడగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న. నాగోబా పూజల కోసం కటోడ బాధ్యతలు చేపడుతు న్న మెస్రం కోసుకు సహాయమందిస్తుంట. కాలినడకన అనేది మా పూర్వీకుల నుంచి వచ్చింది. ఎంతో ఇష్టంతో, నిష్ఠతో ఈ పాదయాత్రను పూర్తి చేస్తం. దైవంపై భక్తిభావనతోనే అడుగులు వేస్తూ ముందుకెళ్తుంటం.
-మెస్రం కోసేరావ్, సాలేవాడ(ఉట్నూర్)
నా తండ్రి సోంజీ మరణంతో పెద్దలు నాకు నాగోబా పేన్ దేవత కోత్వాల్గా పూర్తి బాధ్యతలు అప్పగిం చిన్రు. 20 ఏండ్లుగా గంగాజలం సేక రణలో పాల్గొంటున్న. 22 కితలకు చెందిన మెస్రం వంశీ యులను ఒక చోటకు పిలు వడం నా బాధ్య త. నాగోబా పూజలతోపాటు ఏ కార్యక్ర మాలైన వాటికి సంబంధించిన సమాచారం 22 కితలకు అందిస్తూ ఉంటాను. మెస్రం వంశీయుల పటేల్ ఆదేశా లను పాటించడమే నా బాధ్యత. నాగోబా కృపతో ఈ అవకాశం దక్కింది.
– మెస్రం తిరుపతి, గుంజాల(నార్నూర్)
నాగోబాకు నిర్వహించే మహాపూ జలతోపాటు అన్ని రకాల పూజలకు నైవేద్యాలు అందిం చడం నా బాధ్యత. ఇది మా వంశపారంపర్యంగా వస్తోంది. నేను నాయక్వాడి కితకు ప్రధా న నాయక్వాడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న. నెలవంక చూసినప్పటి నుంచి నాగోబాకు నిర్వహించే అన్ని రకాల పూజలు ముగిసే వరకు నైవేద్యాలు వండి అందిస్తున్న. అన్ని రకాల పూజల సామగ్రిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుత. నేను 21 ఏండ్ల నుంచి ఈ పాదయాత్రలో నడుస్తున్న. నాగోబా పూజలకు నైవేద్యాలు అందించడం నా అదృష్టంగా భావిస్తున్న.
మెస్రం ధర్ము, కెస్లాగూడ (ఇంద్రవెల్లి)
గంగాజలం సేకరణ పాదయాత్రలో పాల్గొనడం నా అదృష్టం. పదేండ్ల సంది ఇందులో పాల్గొంటున్న. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈ పాదయాత్రలో పాల్గొంటున్న. మా కుటుంబం నుంచి నేనొక్కడినే ఈ పాదయాత్రలో పాల్గొంటున్న. నాగోబాను తలుసుకుంటూ ఆద్యంతం భక్తిభావంతోనే ముందుకు సాగుతున్న.
-మెస్రం చిత్రు, కెస్లాపూర్ (ఇంద్రవెల్లి)