మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 24 : నేటి క్రిస్మస్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనుండగా, చర్చిలు ముస్తాబయ్యాయి. రంగు రంగుల విద్యుద్దీపాలతో వాటిని అలంకరించగా, ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. మేరి మాత, పశువుల పాకలు, స్టార్స్, ట్రీలతో కళకళలాడుతున్నాయి. యేసు క్రీస్తు జన్మించిన శుభదినాన్నే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్గా జరుపుకుంటారు. మెర్రీ క్రిస్మస్ అంటే ఆనందం అని అర్థం. సమస్త మానవాళిని పాప విముక్తులను చేసి దైవసన్నిధికి చేర్చేందుకు యేసు ప్రభువు మానవ రూపంలో జన్మించాడని చెబుతారు. నజరేతు గ్రామంలో నివసించే సామాన్య కన్య మరియ.
ఆమె గొప్ప దైవ భక్తురాలు. ఆమెకు వడ్రంగి యువకుడైన యోసేపుతో వివాహం నిశ్చయమవుతుంది. దైవ సంకల్పంతో మరియ గర్భం దాల్చింది. యోసేపు తన స్వగ్రామమైన బెత్లేహాంకు నిండు చూలాలైన మరియను తీసుకెళ్తాడు. పశువుల పాకలో మరియ కుమారుడికి జన్మనిస్తుంది. ఆపై పశువుల తొట్టెలో పడుకోబెడుతుంది. పొలాల్లో పశువులను కాసేకాపరులకు దేవదూతలు కనిపించి, ‘మీకు రక్షకుడు పుట్టాడు’ అని తెలిపి అదృశ్యమవుతారు. ఆ కాపరులు పశువుల పాకకు వెళ్లి బాల యేసును చూసి దేవుని మహిమను లోకానికి తెలియజేశారు. ఇలా మానవాళి పాపాలను ప్రక్షాళన చేసేందుకు యేసు జన్మించాడంటారు. అందుకే క్రైస్తవులు క్రిస్మస్ను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ఆనవాయితీ.
యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు (సోమవారం) క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు జరుపుకోనున్నారు. ఈ మేరకు ఆసిఫాబాద్ జిల్లాలోని చర్చిలతో పాటు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో గల మెదక్ అనుబంధ సీఎస్ఐ చర్చి, బెల్లంపల్లి చౌరస్తాలోని క్యాథలిక్ చర్చి, సక్రెడ్ హార్డ్ చర్చిలను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.