ఎదులాపురం, ఫిబ్రవరి 27 : పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వసతి గృహ సంక్షేమ అధికారులపై ఉందని డీఎస్సీడీవో భగత్ సునీతాకుమారి, డీబీసీడీవో రాజలింగు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ఎస్సీ, బీసీ ఏఎస్డబ్ల్యూవో, వసతి గృహాల సంక్షేమ అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని మెలగాలన్నారు. సందేహాలను నివృత్తి చేస్తూ వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డీ రీజినల్ మేనేజర్ ప్రభాకర్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేశ్, ఉమ్మడి జిల్లాల ఏఎస్డబ్ల్యూవోలు, వసతి గృహాల సంక్షేమ అధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు కిరణ్ కుమార్, ప్రదీప్, శ్రీకాంత్ ఉన్నారు.