గ్రామాల్లో పర్యటిస్తున్న వైద్య సిబ్బంది
కరోనా లక్షణాలున్న వారికి కిట్లు అందజేత
ముందుగానే గుర్తిస్తుండడంతో ఆందోళనకు దూరం
ఇంటింటి జ్వర సర్వేలో మహిళలే కీలకం
నేరడిగొండ,ఫిబ్రవరి 6 : మండలంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత నెల 18 వ తేదీ నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జ్వర సర్వే ప్రతి రోజు కొనసాగుతోంది. ఇప్పటి వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో 572 జ్వరసర్వే కిట్లను ప్రజలకు అందజేశారు. కొవిడ్ లక్షణాలు ఉన్నాయని గుర్తించి ఇంటి వద్దనే మందుల కిట్ను అందించడంతో పెరుగుతున్న పాజిటివ్ కేసులకు అడ్డుకట్ట వేసినట్లయింది. దగ్గు, జ్వరం,జలుబు, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి ఉన్న వారిని గుర్తించి మందుల కిట్లు అందజేశారు. ఓ వైపు కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతూనే ఇంటింటికీ వెళ్లి మందులు ఇవ్వడంతో కరోనాను ఎక్కడికక్కడే కట్టడి చేశారు.
జాగ్రత్తలు విస్మరిస్తే మళ్లీ విజృంభణే…
గత నెల చివరి నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇంటింటి జ్వర సర్వేతో పాజిటివ్ కేసులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. పీహెచ్సీలో 960 మందికి టెస్టులు చేయగా కేవలం 18 మందికి పాజిటివ్గా వచ్చింది. దీంతో కొవిడ్కట్టడికి ఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. బుధవారం నుంచి మాఘమాసం మొదలు కావడంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సంబంధించిన పనులను మొదలు పెట్టారు. ఈ నెల నుండి పెళ్లిళ్లు సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ నిబంధనలు పట్టించుకోకపోయినా, జాగ్రత్తలు పాటించకపోయినా మళ్లీ కేసులు పెరిగేందుకు అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
సర్వేలో ఆమె కీలకం…
కరోనా కట్టడికి మహిళా సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారు. రెండు సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న కరోనా కట్టడిలో మహిళలు ముందున్నారు.ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, జ్వరనిర్ధారణ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం పై ఆరాతీస్తూ ఆరోగ్యం క్షీణించిన వారిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు రక్షిస్తున్నారు.
572 కిట్లు పంపిణీ
జ్వరసర్వేలో భాగంగా మండలంలో ఆరోగ్య సిబ్బంది 572 కిట్లను పంపిణీ చేశారు. కేసులు గణనీయంగా తగ్గడంతో ప్రజలు కొంత ధైర్యంగా ఉన్నారు. ఆరోగ్య సిబ్బంది కృషితోనే వారి సూచనలు, జాగ్రత్తలతో కరోనా కేసులు కట్టడి అయినట్లు ప్రభుత్వ వైద్యులు పేర్కొంటున్నారు.
కేసులు తగ్గుముఖం పడుతున్నాయి
ఇంటింటా జ్వర సర్వే నడుస్తోంది. కిట్లను అందించడంతో పాటు, కరోనా టెస్టులను పెంచడం జరిగింది. పాజిటివ్ వచ్చిన వారికి కిట్లను ఇవ్వడంతో కొంతమేరకు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఫిబ్రవరి నెలలో ప్రజలు సహకరించి జాగ్రత్తలు పాటిస్తే కొవిడ్ నియంత్రణ సాధ్యం అవుతుంది. భౌతికదూరం, మాస్కులను ధరించడం వల్లనే కోవడ్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
ఆనంద్కుమార్, మండల వైద్యాధికారి , నేరడిగొండ