ప్రైవేటు దవాఖానల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రైవేటు వైద్యశాలలను తనిఖీ చేయాలని వైద్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్ జిల్లా వైద్యాశాఖ అధికారులు పలు ప్రైవేటు ఆస్పత్రులను పరిశీలించారు. నిర్మల్ జిల్లాలో శుక్రవారం నుంచి తనిఖీలు నిర్వహించనున్నారు. అనుమతులు లేని దవాఖానలు, నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఆదిలాబాద్, సెప్టెంబరు 22(నమస్తే తెలంగాణ ) : ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని ప్రైవేటు వైద్యశాలల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా, విద్యార్హతలు లేని వైద్యులు, కనీస సౌకర్యాలు కల్పించకుండా వైద్యం కోసం వచ్చేవారిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అర్హతలు లేని వారిని వైద్యులుగా నియమించుకుని అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చిన్న గదుల్లో దవాఖానలను ఏర్పాటు చేసుకుని చికిత్సల కోసం వచ్చేవారికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. దవాఖానల్లో ల్యాబ్లను నిర్వహిస్తూ వివిధ రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అవసరం లేకుండా మందులు రాస్తున్నారు. నకిలీ వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకం కారణంగా చిన్న రోగంతో వచ్చిన వారు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు లక్షల రూపాయలు దండుకున్నారు.
ఆసుపత్రులపై నిఘా
ప్రైవేటు దవాఖానల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు దవాఖానాలకు అనుమతులు ఉన్నాయా? విద్యార్హతలు కలిగిన వైద్యులు ఉన్నారా? నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశారా? ఆపరేషన్ థియేటర్లు, పేషేంట్లకు చికిత్సలు అందించే గదులు, రోగ నిర్ధారణ కేంద్రాల నిర్వాహణ, అగ్ని ప్రమాదాలు జరుగకుండా తీసుకుంటున్న చర్యలు, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ వంటి విషయాలపై అధికారులు దృష్టి సారించారు. ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా వైద్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంతోపాటు, బేలలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో శుక్రవారం నుంచి ప్రైవేటు దవాఖానలను పరిశీలిస్తామని వైద్యశాఖ అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని ఆసుపత్రుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తనిఖీలు నిర్వహిస్తాం..
– ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించాం. ఆసుపత్రికి లైసెన్స్ ఉందా, క్వాలిఫైడ్ డాక్టర్లు, పరికరాలు, శానిటేషన్, వ్యర్థాల నిర్వహణ, ఫైర్ సేప్టీ ఇతర అంశాలను పరిశీలిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా వైద్యశాఖ అధికారుల బృందం ప్రైవేటు ఆసుపత్రులను క్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని సీజన్ చేసి, నిర్వాహకులు చర్యలు తీసుకుంటాం.
నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి,ఆదిలాబాద్