నిర్మల్, మే 27(నమస్తే తెలంగాణ): మహిళల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు ప్రాధాన్యతనిస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, షీటీమ్స్, సఖీ కేంద్రాలు, తదితర ఎన్నో పథకాలతో భరోసానిస్తున్నది. ఇటీవల అతివల కోసం మరో కార్యక్ర మానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వారి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా మహిళా వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో రెండు అర్బన్ కేంద్రాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లకు విశేష స్పందన వస్తున్నది. ప్రతి మంగళవారం స్త్రీలకు వివిధ పరీక్షలు నిర్వహిస్తుం డగా, గత 10 వారాల్లోనే 1814 మంది మహిళలు సద్వినియోగం చేసుకున్న ట్లు అధికార యంత్రాగం చెబుతున్నది. కాగా, సర్కారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు తమ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయని మహిళలు కొనియాడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య మహిళా కార్యక్రమానికి నిర్మల్ జిల్లాలో విశేష స్పందన వస్తున్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను సర్కారు ప్రారంభించింది. ఈ మేరకు నిర్మల్ జిల్లాలో రెండు అర్బన్ హెల్త్ సెంటర్లను ఎంపిక చేసి ప్రతి మంగళవారం ప్రత్యేక పరీక్షలు చేస్తున్నారు. నిర్మల్లోని బంగల్పేటలో గల అర్బన్ హెల్త్ సెంటర్తో పాటు, భైంసాలోని అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందులో అన్ని వయసుల మహిళలకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందజేస్తున్నారు. వైద్య సేవల కోసం ప్రతి మంగళవారం ప్రత్యేక క్లినిక్లను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య పరీక్షలను నిర్వహించి వ్యాధి నిర్ధారణ అనంతరం మందులు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన గత 10 వారాల్లోనే రెండు ఆరోగ్య మహిళా కేంద్రాల పరిధిలో 1814 మంది మహిళలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఇందులో 182మందిని మెరుగైన చికిత్స కోసం రెఫర్ చేశారు.
ఎనిమిది విభాగాల్లో పరీక్షలు…
ఆరోగ్య మహిళా కేంద్రాల్లో 8 విభాగాల్లో మహిళలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించి ఉచితంగా చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రాథమిక డయాగ్నోస్టిక్, సూక్ష్మ పోషక లోపాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్, పీఐడీ, పీసీవోఎస్, కుటుంబ నియంత్రణ, రుతుస్రావ సమస్యలు, మోనోపాజ్ మేనేజ్మెంట్, లైంగిక వ్యాధులు, శరీర బరువు తదితర అంశాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తున్నారు. కేంద్రానికి వచ్చే మహిళల వివరాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. మహిళలకు సంబంధించి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే జిల్లా ప్రధాన దవాఖానకు రెఫర్ చేస్తున్నారు. క్యాన్సర్, గర్భాశయ సమస్యలు నిర్ధారణ అయిన వారిని దవాఖానలకు పంపించి చికిత్స అందేలా చూస్తున్నారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో సిబ్బంది మొత్తం మహిళలే కావడంతో ఇక్కడికి వచ్చే మహిళలు తమ సమస్యలను నిర్మోహమాటంగా చెప్పుకుంటున్నారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రతి మంగళవారం సెంటర్కు వచ్చి వైద్యులతో మాట్లాడి చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహిళలు దవాఖానకు వెళ్లాలంటే ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో అందరూ మహిళా వైద్యులను నియమించి చికిత్స అందిస్తున్నది.
నెలసరి సమస్య బాధ పోయింది…
గత ఏడాది కాలంగా నెలసరి సక్రమంగా లేక చాలా ఇబ్బంది పడ్డాను. ప్రైవేటు లో చూపించుకునే ఆర్థిక స్థోమత లేదు. ప్రతి మంగళవారం బంగల్పేట దవాఖానలో మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిసింది. నెల రోజుల క్రితం ఇక్కడికి వచ్చి చూయించుకున్న. డాక్టరమ్మ రక్త పరీక్షలు చేయించి, పరీక్షల రిపోర్టుల ప్రకారం మందులు ఇచ్చిన్రు. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. మళ్లీ ఒక సారి చూపించుకుందామని వచ్చిన. ఇక్కడికి వచ్చేవారంతా మహిళలే కావడంతో సమస్యలు చెప్పుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.
-సంగీత, బేస్తవార్పేట్, నిర్మల్
మహిళా ఆరోగ్యానికి ప్రాధాన్యం..
మహిళల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లాలో ప్రత్యేకంగా రెండు మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ శిబిరంలో మహిళా సిబ్బంది, మహిళా డాక్టర్లు విధుల్లో ఉంటారు. భైంసా, నిర్మల్ అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈ మహిళా క్లినిక్లను నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు ఆయా క్లినిక్ల ద్వారా గత 10 వారాల్లో మొత్తం 1814 మంది మహిళలకు వైద్య సహాయాన్ని అందజేశాం. అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం జిల్లా దవాఖానకు రెఫర్ చేస్తున్నాం. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–ధన్రాజ్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, నిర్మల్
అన్ని రకాల పరీక్షలు చేస్తున్నాం..
ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా క్లినిక్లకు మంచి స్పందన వస్తున్నది. 100-150 ఓపీ ఉంటున్నది. వచ్చిన వారిలో సమస్యను బట్టి 25-30శాతం మందికి రక్త పరీక్షలు చేయిస్తున్నాం. టెస్టుల రిపోర్టుల ఆధారంగా ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే వారికి సమాచారమిచ్చి అవసరమైన చికిత్సను అందజేస్తున్నాం. ముఖ్యంగా రక్తంలో విటమిన్ డీ-3, బీ-12, క్యాల్షియం లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి ప్రత్యేకంగా మందులను ఇస్తున్నం. జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన టీ- డయాగ్నోస్టిక్ హబ్లో ఉచితంగా అన్ని రకాల రక్త పరీక్షలు చేయిస్తున్నాం. టీనేజ్లో థైరాయిడ్ సమస్యతో వచ్చే పీసీవోఎస్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మోనోపాజ్, సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలు కూడా చేస్తున్నాం. పాజిటివ్ వస్తే హయ్యర్ సెంటర్కు రెఫర్ చేస్తున్నం. మహిళా క్లినిక్ల ఏర్పాటుతో మహిళలు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను చెప్పుకుంటున్నారు.
–డీ.సౌమ్య, మెడికల్ ఆఫీసర్