మూగజీవాల సంరక్షణకు సర్కారు ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. వేసవిలో వ్యాధులు సోకే ముప్పుఉండడంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నివారణ టీకాల కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇందులో భాగంగా గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు ఉచితంగా వేయడానికి కార్యాచరణ రూపొందించింది. రేపటి(బుధవారం) నుంచి 111 మంది సిబ్బంది 31 బృందాలుగా ఏర్పడి టీకాలు వేయనున్నారు. ఈ కార్యక్రమం వారం రోజులపాటు కొనసాగనుండగా.. గొర్రెలు, మేకలు ఉన్న రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నిర్మల్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): మూగ జీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ప్రతిఏటా వేసవిలో మూగ జీవాలకు వ్యాధులు సోకే అవ కాశం ఉన్నందున పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతు న్నది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలోని 5,02,576 గొర్రెలకు, 1,31,866 మేకలకు నట్టల నివారణ మందును ఉచితంగా పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందిం చారు. జిల్లా వ్యాప్తంగా 47 పశువైద్యశాలలు ఉండగా, ఇప్పటి కే ఆయా సెంటర్లకు నట్టల నివారణ డోసులు చేరుకున్నాయి. ఆయా పశువైద్య శాలల పరిధి లోని గ్రామాల్లో గల గొర్రెలు, మేకలకు ఈ టీకాల ను పంపిణీ చేసేందుకు 111మంది సిబ్బందితో 31 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీమ్లు ప్రతి రోజూ 31గ్రామాలను ఎంపిక చేసుకొని ఆయా గ్రామాల్లోని గొర్రెలు, మేకలకు నివారణ టీకాలను వేయనున్నారు. ఈ కార్యక్ర మం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 22న ప్రారంభమై 29 వరకు కొనసాగుతుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 31 బృందాలు…
ఈ నెల 22 నుంచి జిల్లా వ్యాప్తంగా నట్టల నివారణ టీకాలను పంపిణీ చేయనున్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక డ్బందీ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం 111మంది సిబ్బందిచే ప్రత్యేకంగా 31 బృందాల ను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు గ్రామాల్లో క్యాంపులు నిర్వహిస్తూ మేకలు, గొర్రెలకు టీకాలు వేయనున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న 6,34,442 గొర్రెలు, మేకలకు నట్టల మందు లను వేసేందుకు కార్యాచరణ రూపొందించారు.
రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి..
మూగజీవాల్లో అంతర పరాన్న జీవులను నివారిస్తే వాటి ఎదుగుదల వేగంగా జరుగు తుంది. జలగలు, బద్దె పురుగులు, నత్త గుల్లలు మొదలగునవి కాలేయం, జీర్ణాశయం, చిన్నపేగు భాగాల్లో చేరి అక్కడే అంటిపెట్టుకొని రక్తాన్ని పీల్చే అవకాశం ఉంటుంది. దీంతో గొర్రెలు, మేకలు రక్త హీనతకు గురవుతాయి. తద్వారా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి బలహీనంగా మారి రకరకాల వ్యాధుల బారిన పడతాయని పశు వైద్యాధి కారులు చెబుతున్నారు. గొర్రెలు నిల్వ ఉండే నీటిని తాగడం వల్ల జలగలు కడుపులోకి చేరి వాటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే పచ్చిక బయళ్లతో గడ్డిని తినడం వల్ల దానిపై ఉండే బద్దె పురుగులు కొన్ని సార్లు కడుపులోకి చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో గొర్రెలు, మేకలు వ్యాధుల భారిన పడే అవకాశం ఉన్నందున రైతులు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు..
వ్యాధి సోకిన గొర్రెలు మందలో చురుగ్గా నడవలేకపోతాయి. కండ్లు, ముక్కు నుంచి నీరు కారడం మొదలవుతుంది. శరీరంపై వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఉంటాయి. చర్మం గరుకుగా ఉంటుంది. మూత్రం ఎక్కువగా పోస్తుంటాయి. సరిగ్గా మేత మేయదు. ఆకలి మందగించడం, శ్వాస వేగం తగ్గటం వంటి లక్షణాలు ఉంటాయి.
నివారణ చర్యలు…
ప్రతీ సంవత్సరం నట్టల నివారణ మందులను గొర్రెలు, మేకలకు తప్పనిసరిగా వేయించాలి. జీవాలకు వ్యాధి సోకిన వెంటనే మంద నుంచి వేరు చేయాలి. వ్యాధి సోకినప్పుడు యాంటీ బయోటెక్ ఇంజెక్షన్లు వైద్యాధికారుల సూచన మేరకు ఇప్పించాలి. వాధి సోకిన గొర్రెలు, మేక లను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలి. ప్రభుత్వం ప్రతి ఏటా ఉచితంగా అందజేస్తున్న నట్టల నివారణ మందులు వేయడం ద్వారా గొర్రెలు, మేకలకు ఎలాంటి వ్యాధులు సోకవని వైద్యాధికారులు అంటున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి…
ఈ నెల 22 నుంచి 29 వరకు నట్టల నివార ణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహిం చను న్నాం. గొర్రెలు, మేకలు ఉన్న రైతు లు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకో వాలి. ప్రత్యేక బృందాలు అన్ని గ్రామాల్లో శిబిరాలు నిర్వ హిస్తాయి. అధికారులకు రైతులు, కాపరులు సహకరించాలి. టీకాలు వేయించడం ద్వారా గొర్రెలు, మేకలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.
– బీ శంకర్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి