ఎదులాపురం, జనవరి 24: పద్మశాలీల కులదైవం మార్కండేయ జయంతి ఉత్సవాలను మంగళవారం శాంతినగర్లోని సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ మార్కండేయ చిత్రపటానికి పూజలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం అన్ని మతాలు, కులాలను గౌరవిస్తున్నదని చెప్పారు. ఈ క్రమంలోనే పద్మశాలీల కులదైవమైన మార్కండేయ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాలుకా అధ్యక్షుడు బొమ్మకంటి రమేశ్, ఉపాధ్యక్షుడు అనుముల ఉశన్న, డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ జిట్ట రమేశ్, సభ్యులు జక్కుల సత్యనారాయణ, మేకల నర్సింహులు, శ్రీనివాస్, నరేశ్ పాల్గొన్నారు.
మార్కండేయ పల్లకీ ఊరేగింపు
శ్రీ శివ భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడ గ్రామంలో మార్కండేయ పల్లకీని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మార్కండేయ భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రూరల్ మండల ఎంపీపీ గండ్రత్ రమేశ్, సర్పంచ్ గంగారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధుల్లో మార్కండేయ పల్లకీని ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో ముందు నడువగా, భక్తుల మార్కండేయ నామస్మరణతో గ్రామ వీధులన్నీ మార్మోగాయి. అనంతరం మార్కండేయ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ నారాయణ, జైరాం, జయంత్, నాగన్న, నవీన్, భూమన్న, గ్రామ యువకులు, మహిళలు పాల్గొన్నారు.
బోథ్ మండలంలో..
బోథ్లోని శివ భక్త మార్కండేయ ఆలయంలో మార్కండేయ జయంతిని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మార్కండేయ చరిత్రను పఠించారు. శ్లోకాలు చదివారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేయించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో బోథ్ మండల పద్మశాలీ కులస్తులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మండలంలోని ధన్నూర్ (బీ) గ్రామంలో మార్కండేయ జయంతిని పద్మశాలీ సంఘ భవనంలో నిర్వహించారు. మార్కండేయ చిత్ర పటానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు ఆసాల సదాశివ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సామల సంతోష్, ప్రధాన కార్యదర్శి కొండ ఎర్రన్న, సలహాదారు శ్రీరామ్ శంకర్, నారాయణ, రాజేశ్వర్, బుచ్చన్న, స్వామి, గణేశ్, విష్ణు, నరేశ్ పాల్గొన్నారు.