మంచిర్యాల జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసిన రాష్ట్ర సర్కారు, రూ. 17 కోట్లతో సకల సౌకర్యాలతోపాటు, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చింది. విశాలమైన తరగతి గదులు, ప్రత్యేకమైన ల్యాబ్లు, మ్యూజియంలు, లైబర్రీలు, ప్రొజెక్టర్లు, ఎల్సీడీ స్క్రీన్లు, సరిపడా బోధనా సిబ్బంది, 30కిపైగా అవయవాలకు సంబంధించిన బోర్డులు.. ఇలా ఒకటేమిటి వైద్య విద్యకు కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసింది. ఇక కొద్ది రోజుల్లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా, ఇటీవల జాతీయ వైద్య కమిషన్ అనుమతి నిరాకరించింది. రేకుల షెడ్లల్లో కాలేజీ ఏర్పాటు చేయడమే అందుకు కారణమని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరోసారి కేంద్రానికి అప్పీల్ చేయగా, సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. కాగా, గురువారం ‘నమస్తే తెలంగాణ’ కళాశాలను సందర్శించగా, కండ్లు చెదిరేలా వసతులు కనిపించాయి.
మంచిర్యాల, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యకు ప్రాధాన్యమిస్తూనే సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ నిరుపేదలకు భరోసానిస్తున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా మరో 8 మెడికల్ కళాశాలలను మంజూరు చేసింది. ఇందులో మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎన్హెచ్సీ (జాతీయ వైద్య కమిషన్) ఐదు రోజుల క్రితం అనుమతి నిరాకరించింది. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ యార్డులోని షెడ్లలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో తరగతులు ప్రారంభించనుండగా, ఇంతలోనే ఈ విషయం తెలిపింది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలతో సహా పొరుగున ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఈ విషయం చర్చనీయాంశమవుతున్నది. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ గురువారం కళాశాలను సం దర్శించగా, కండ్లు చెదిరే వసతులు కనిపించాయి.
పలు జిల్లాల్లోనూ మార్కెట్ యార్డుల్లోనే..
మంచిర్యాల జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లు విడుదల చేసింది. తరగతులు, ఇతరు సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో మార్కెట్ యార్డు షెడ్డుల్లో వసతులు ఏర్పాటు చేశారు. కమిషన్ నియమనిబంధనల మేరకు అవసరమైన బోధకులు, కిందిస్థాయి సిబ్బందిని నియమించారు. పర్యవేక్షణకు వచ్చిన ప్రతీసారి ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంచిర్యాల ఒక్కటనే కాదు అనేక చోట్ల మార్కెట్ యార్డుల్లోనే వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. అదే ఇక్కడ కూడా జరిగింది. నూతనంగా మంజూరైన మిగిలిన వైద్య కళాశాలతో పోలిస్తే మంచిర్యాల కళాశాలలో తరగతుల నిర్వహణ భవనాలు, గదులు, ల్యాబ్లను అందంగా తీర్చిదిద్దారు. రేకులు కనిపించకుండా సీలింగ్ వేయడంతో పాటు, పాలిష్ బండలతో ప్లోరింగ్ చేయించారు.
రెండు బ్లాకుల్లో అన్ని ఏర్పాట్లు..
వైద్య విద్య మెదటి సంవత్సరంలో మూడు సబ్జెక్టులు బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, అనాటమీ బోధిస్తారు. ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించి మొత్తం రెండు బ్లాకుల్లో డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ఫిజియాలజీ, అనాటమీ ఒక బ్లాక్లో, బయోకెమిస్ట్రీ మరో బ్లాక్లో ఉంది. ఒకేసారి 25 నుంచి 50 మంది విద్యార్థులు కూర్చునేలా మొత్తంగా 10 డెమో రూమ్లను తీర్చిదిద్దారు. ప్రతి రూమ్లో ప్రొజెక్టర్లు, ఎల్సీడీ స్క్రీన్లు, బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రత్యేకమైన ల్యాబ్లు, మ్యూజియంలు, లైబర్రీలను తీర్చిదిద్దారు. ఇవేగాకుండా రెండు లెక్చర్ హాళ్ల (ఒక్కో హాల్లో 180 మంది విద్యార్థులు కూర్చునే సామర్థ్యంతో)ను అందుబాటులోకి తెచ్చారు.
30కి పైగా బోర్డులు
ఫిజియాలజీ డిపార్ట్మెంట్లోని రీసర్చ్ ల్యాబ్లో ఫిజియోగ్రాఫ్స్, స్పెరోమెట్రీ, ఆల్గో మీటర్లు, బీపీ పరీక్షించేందుకు అవసరమయ్యే, వ్యాయామం చేసుకునే సైకిళ్లు, థ్రెడ్మిల్స్ ఏర్పాటు చేశారు. మ్యూజియంలో శరీరంలోని అవయవాల పనితీరును వివరించే బోర్డులను ఉంచారు. ఒక్కో బోర్డుకు రూ.5 వేల వరకు వెచ్చించారు. ఇలా మొత్తం 30కిపైగా అవయవాలకు సంబంధించిన బోర్డులు మ్యూజియంలో ఏర్పాటు చేశారు. హెమటాలజీ ల్యాబ్లో శరీరంలోని అన్ని అవయవాల బొమ్మలు ఉంచారు. తల భాగం, గుండె, కిడ్నీ, కాలేయం.. ఇలా అన్ని బొమ్మలు ఇందులో ఉన్నాయి. క్లినికల్, సెంట్రల్ రీసర్చ్ ల్యాబ్, ప్రత్యేక లైబర్రీ సైతం ఉన్నాయి.
ఒకేసారి 150 మంది ఉపయోగించుకునేలా..
అనాటమీ డిపార్ట్మెంట్లో హిస్టాలజీ ల్యాబ్లో మైక్రోస్కోప్స్, ప్రొజెక్టర్స్, ఎల్సీడీ స్క్రీన్లు పెట్టారు. బ్యాచ్ల వారీగా ఒకేసారి 150 మంది విద్యార్థులైనా సరే ఈ ల్యాబ్ను ఉపయోగించుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడున్న మ్యూజియంలో సైతం శరీరభాగాల బొమ్మలతో పాటు నిజమైన స్పెసిమెన్స్ను చూడొచ్చు. రూ.6.5 లక్షలతో స్కెల్టన్(మనిషి ఎముకల గూడు) కొనుగోలు చేశారు. డిస్పెన్షన్ హాల్లో డెడ్ బాడీస్ను పరీక్షించేందుకు 15కు పైగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. బాడీ కట్టింగ్ మిషన్, స్టోరేజీ ట్యాంకులు, ఎంబాల్మింగ్ మిషన్లు(బాడీలకు ప్లూయిడ్స్ ఎక్కించే) పరికరాలు, కోల్డ్ స్టోరేజీ పరికరాలను సిద్ధం చేశారు.
బయోకెమిస్ట్రీ ల్యాబ్లో విలువైన పరికరాలు
బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లోని ల్యాబ్లోనూ ప్రొజెక్టర్, ఎల్సీడీలు ఉన్నాయి. కెమికల్ టెస్టింగ్కు అవసరమైన అన్ని పరికరాలు సెంట్రీప్యూస్ మిషన్లు, హాట్ ఎయిర్ ఓవెన్స్, వాటర్ బాత్ మిషన్లు, అనలైజర్లు, డిజిటల్ అనలైజర్లను సమకూర్చారు. వాటర్ కనెక్షన్తో పాటు ఇంటర్నల్ గ్యాస్ కనెక్షన్ వసతి కల్పించారు. రీసర్చ్ ల్యాబ్లో టిష్యూ ప్రాసెసర్స్, ఎలక్టోరైట్స్ మిషన్లు, వాటర్ బాత్ మిషన్లతో పాటు ఇతర విలువైన పరికరాలను అందుబాటులోకి తెచ్చారు.
గతంలోనూ ఓ సారి..
గతంలో భద్రాద్రి కొత్తగూడం మెడికల్ కాలేజీ విషయంలోనూ జాతీయ వైద్య కమిషన్ ఇలాగే పేచీ పెట్టి.. చివరకు ఆమోద ముద్ర వేసింది. అత్యాధునిక పరికరాలతో, అందమైన వసతులు ఉన్న మంచిర్యాల కళాశాలకు అదే తరహాలో అనుమతి వచ్చే అవకాశాలున్నాయి. రేకులషెడ్డుల్లో ఉన్నప్పటికీ విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని, కోట్లాది రూపాయల విలువైన పరికరాలను సమకూర్చుకున్నామని జిల్లా యంత్రాంగం గురువారం కమిషన్కు మరోసారి అప్పీల్ చేసింది. ప్రతి డిపార్ట్మెంట్కు 8 నుంచి 10 మంది బోధనా సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతరులు కలుపుకొని 54 మంది సిబ్బందిని ఇప్పటికే రిక్రూట్ చేసుకున్నారు. మొదటి సంవత్సరం చదివే 150 మంది విద్యార్థులకు ఈ సిబ్బంది సరిపోతుంది. రానున్న రోజుల్లో పక్కా భవనాలు, మరిన్ని వసతులు సమకూర్చుకుంటామని కమిషన్కు పంపిన అప్పీల్లో పేర్కొన్నట్లు తెలిసింది.