నస్పూర్/ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 21 : ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024ను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు బీ. భారతి లక్పతినాయక్ ఆదేశించారు. ఆదివారం నస్పూర్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు బోర్కడే హేమంత్ సహదేవ్రావు, బదావత్ సంతోష్, రాహుల్రాజ్, అశీష్సంగ్వాన్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, రాహుల్, సభావత్ మోతీలాల్, ఫైజన్ అహ్మద్లతో కలిసి ఎన్నికల, రిటర్నింగ్ అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భారతి లక్పతినాయక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, దానిని సద్వినియోగం చేసుకోవాలంటే ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా 6,7,8 ఫారాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, వయసు, అర్హత గల దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు తమ వివరాలు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటరు జాబితాలో ఓటర్ల ఫొటోలు స్పష్టంగా కనబడే విధంగా చూడాలని సూచించారు.
ఫిబ్రవరి 2న ఫిర్యాదులను పరిష్కరించాలని, 6న పారామీటర్లు పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం అనుమతి పొంది.. 8న తుది జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు. నూతన ఓటరు నమోదు, జాబితా సవరణపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేసుకునేలా అవగాహన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, జనవరి 21: పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ ఓటరు జాబితా పరిశీలకులు బీ భారతి లక్పతి నాయక్ ఆదేశించారు. ఆదివారం నస్పూర్లోని ఆక్స్ఫర్డ్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 335, 336, 337, 338 పోలింగ్ కేంద్రాలను ఆమె కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి సందర్శించారు. ఓటరు నమోదు పక్రియ, తొలగింపులు, మార్పులు చేర్పుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు లిస్టులను పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు.
స్పష్టమైన ఫొటో ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా నూతన ఓటరు నమోదు, సవరణలు, మార్పులు, తొలగింపుల కోసం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరణించిన వారి వివరాలను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు నోటీలు జారీ చేయాలని సూచించారు. 22వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, ఫిబ్రవరి 2వ తేదీలోగా పరిష్కరించాలని, 8వ తేదీ వరకు తుది ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆమె వెంట మంచిర్యాల ఆర్డీవో రాములు, తహసీల్దార్ వనజారెడ్డి ఉన్నారు.