మంచిర్యాల, మే 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన పాలిసెట్ ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఎంపీసీ, ఎంబైపీసీ విభాగాల్లో అత్యుత్తమ ర్యాంక్లు సాధించారు. మంచిర్యాల జిల్లా హమాలీవాడకు చెందిన రేగొండ అక్షిత్ ఎంపీసీలో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్, బెల్లంపల్లికి చెందిన అడగొప్పుల సన్నిత్ ఎంపీసీలో 106వ, ఎంబైపీసీలో 23వ ర్యాంకులు సాధించి ఆదర్శంగా నిలిచారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పాలిసెట్ ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఎంపీసీ, ఎంబైపీసీ విభాగాల్లో అత్యుత్తమ ర్యాంక్లను ఖాతాలో వేసుకున్నారు. మంచిర్యాల జిల్లా హమాలీవాడకు చెందిన రేగొండ అక్షిత్ రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించాడు. ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయి టాప్-15లో అక్షిత్ ఒక్కడే ర్యాంక్ దక్కించుకున్నాడు. బెల్లంపల్లికి చెందిన అడగొప్పుల సన్నిత్ ఎంపీసీలో 106, ఎంబైపీసీలో 23వ ర్యాంకులు సాధించాడు. ఆదిలాబాద్ జిల్లాలో 1117 విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు హాజరుకాగా, ఎంపీసీలో 961 మంది (86.03శాతం), ఎంబైపీసీలో 978 మంది(87.56) మంది క్వాలిఫై అయ్యారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1089 విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు హాజరుకాగా, ఎంపీసీలో 921 మంది (84.57శాతం), ఎంబైపీసీలో 943 మంది(86.59) మంది అర్హత సాధించారు. మంచిర్యాల జిల్లాలో 3417 విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు హాజరుకాగా, ఎంపీసీలో 2851 మంది (83.44శాతం), ఎంబైపీసీలో 2808 మంది(82.18) మంది, నిర్మల్ జిల్లాలో 2278 విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు హాజరుకాగా, ఎంపీసీలో 1852 మంది (81.30శాతం), ఎంబైపీసీలో 1899 మంది(83.36) మంది క్వాలిఫై అయ్యారు. జిల్లాల వారీగా టాప్-3 ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారికి వచ్చిన ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి.
కంప్యూటర్ సైన్స్లో రాణిస్తా..
సోన్/నిర్మల్ అర్బన్, మే 26 : మాది నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ కాలనీ. మా అమ్మానాన్నలు నరేశ్, విజయలక్ష్మి. నేను సెయింట్ థామస్ పాఠశాలలో పదోతరగతి చదివాను. మా నాన్న ఉపాధ్యాయుడు. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే రాష్ట్రస్థాయి పాలిసెట్లో 108వ ర్యాక్ సాధించాను. గతంలో మా అక్క కూడా 51వ ర్యాంక్ సాధించి. కంప్యూటర్ సైన్స్లో రాణించడమే నా లక్ష్యం. అందుకు తగ్గట్లుగా నిరంతరం శ్రమిస్తాను.
– అభిరాం, నిర్మల్
సివిల్స్ సాధిస్తా..
మాది నిర్మల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామం. నేను వాసవీ ఒలంపియాడ్లో పదోతరగతి చదివాను. పాలిసెట్ ప్రవేశ పరీక్షల్లో 112 మార్కులు సాధించాను. దీంతో రాష్ట్రస్థాయిలో 90వ ర్యాంక్ వచ్చింది. మా అమ్మానాన్నలు రవి, రాధ ప్రోత్సాహంతో ఎంతో బాగుంది. మొదటి నుంచి సివిల్స్లో ర్యాంక్ సాధించడమే నా ఆశయం. ఈ ర్యాంక్ సాధించడంతో మా తల్లిదండ్రులు సంతోషపడ్డారు. తండ్రి ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్లో విధులు నిర్వహిస్తున్నారు.
– రితిక, వెంకటాపూర్
ఇంజినీర్ అవుతా..
లక్ష్మణచాంద, మే 26 : నేను నిర్మల్లోని విన్నర్ స్కూల్లో ఏడో తరగతి నుంచి చదువుతున్నాను. లెక్కలు అంటే చాలా ఇష్టం. పదోతరగతిలో టెన్ బై టెన్ జీపీఏ సాధించాను. నాకు ఇంజినీర్ కావాలని ఉంది. ఐఐటీ లాంటి పెద్ద చదువులు చదువాలని ఉంది. మా నాన్న షేక్ హుస్సేన్ టీచర్ కావడంతో ఇంటివద్ద ఎప్పటిప్పుడు నా డౌట్స్ తీర్చుతారు. పాలిసెట్లో 26వ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో పై చదువులు చదువుతాను.
– షేక్ అమన్