తాండూర్/కాసిపేట, బెల్లంపల్లి టౌన్ : అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో ఉండేలా చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆదివారం తాండూర్ , కాసిపేట , బెల్లంపల్లి మండలాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ పండుగను ప్రతి మహిళ సంతోషంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పాలనలో ఎంతో మంది ముఖ్యమంత్రులయ్యారని, కాని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎవరూ ప్రవేశపెట్టలేదన్నారు. బీజీపీ ఉన్న రాష్ట్రాల్లో అతి తక్కువ పింఛన్ ఇవ్వడంతో పాటు సరైన పథకాలు కూడా లేవన్నారు. ఈ కార్యక్రమంలో తాడూరు ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, కాసీపేట ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రంరావు, రైతు సమితి అధ్యక్షుడు దుర్గం పోశం తదితరులు పాల్గొన్నారు.