తాండూర్, ఫిబ్రవరి 11 : సనాతన ధర్మ పరిరక్షణ, విస్తరణ, జాతీయ సమైక్యతను పెంపొందించే లక్ష్యంతో ఓ యువకుడు దేశవ్యాప్తంగా సాహసోపేతమైన సైకిల్ యాత్ర చేపట్టాడు. ఒడిశా రాష్ట్రం నుంచి సైకిల్ యాత్ర చేపట్టిన యువకుడు సుబ్రత్ మహరాణా యాత్ర బుధవారం తాండూర్ చేరింది. ఒడిషా రాష్ట్రంలోని ఝార్సుగూడ జిల్లా, బెల్బిహార్ జురా గ్రామానికి చెందిన ఈ యువకుడు.. స్వగ్రామం నుంచి పది రోజుల కిందట ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. తన తండ్రి పద్మనాభ మహరాణా ఆశయాలకు అనుగుణంగా, తల్లి సుకాంతి మహరాణా అందిస్తున్న ప్రోత్సాహంతో ఈ యాత్ర ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
గతంలోనూ ఆయన గోమాత పరిరక్షణ కోసం 8 రాష్ట్రాల్లో సైకిల్ పై పర్యటించి.. గోవుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం దేశంలో ప్రాంతాలు, కుల మతాల మధ్య భేదాలను తొలగించి, ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే సందేశాన్ని వ్యాప్తి చేయడం, మట్టిని రక్షించడం, చెట్లను నాటడం వంటి పర్యావరణ పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించడం, సైకిల్ తొక్కడం ద్వారా ఆరోగ్యాన్ని, దేశవ్యాప్త యాత్ర ద్వారా దేశభక్తిని పెంపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో పలు ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నట్లు తెలిపారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, శ్రీశైలం, తిరుపతి, అరుణాచలం, రామేశ్వరం వరకు ప్రయాణించి అక్కడి నుంచి ఉత్తర భారతదేశంలోని చార్ధామ్ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడంతో యాత్ర ముగుస్తుందని వివరించారు.