భూపాలపల్లి( నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 22: సింగరేణి సంస్థ తట్టాచమ్మాస్తో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించి, మారుతున్న కాలానికి అనుగుణంగా అంచెలంచెలుగా అత్యాధునిక టెక్నాలజీతో ముందుకెళ్తున్నది. 1948లో జాయ్లోడర్ షెటిల్ కార్లను ప్రవేశపెట్టి యాంత్రీకరణకు శ్రీకారం చుట్టిన సంస్థ, పవర్ డంపర్ కాంబినేషన్, ఇన్పిట్క్రషర్ అండ్ కన్వేయర్ విధానం, డ్రాగ్లైన్ ఎక్యూప్మెంట్ ఓవర్బర్డెన్ తొలగింపు విధానం, సర్ఫేస్ మైనర్ ద్వారా కాలుష్య రహిత బొగ్గు ఉత్పత్తి విధానం, హైవాల్ మైనింగ్ విధానం లాంటివి అమలుపరుస్తున్నారు. సైడ్ డిచార్డ్ లోడర్ (ఎస్డీఎల్), లోడ్ హాల్ డంపర్ (ఎల్హెచ్డీ)లను ప్రవేశపెట్టి బొగ్గు ఉత్పత్తి పెంచడమే కాకుండా ఉత్పత్తి జరిగే ప్రదేశాల్లో ప్రమాదాలను పూర్తిగా తగ్గించగలిగింది. కంటిన్యూయస్ మైనర్ (సీఎంఆర్)తో బ్లాస్టింగ్ గ్యాలరీ, బొగ్గు ఉత్పత్తి విధానాన్ని అమలు చేస్తోంది. దేశంలోనే అతిపెద్ద లాంగ్వాల్ మైనింగ్ విభాగాన్ని రామగుండం 3 ఏరియాలోని అడ్రియాలా గనిలో ఏర్పాటు చేసింది.
ప్రప్రథమంగా డబుల్ బెడ్రూం క్వార్టర్స్ నిర్మాణం
సింగరేణి చరిత్రలోనే ప్రప్రథమంగా ఉద్యోగుల నివాసార్థం సత్తుపల్లి, భూపాలపల్లి ఏరియాల్లో అధునాతన సౌకర్యాలతో డబుల్ బెడ్రూం క్వార్టర్స్ నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా సత్తుపల్లిలో ఎంసీ టైప్-72 డబుల్ బెడ్రూం క్వార్టర్లు, ఎండీ టైప్-280 డబుల్ బెడ్రూం క్వార్టర్లు రూ.52.80 కోట్లతో నిర్మించింది. ఈ క్వార్టర్లను ఉద్యోగులకు కేటాయించింది. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఉద్యోగుల నివాసార్థం రూ.166.22 కోట్ల వ్యయంతో 994 డబుల్ బెడ్రూం క్వార్టర్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే ఇందులో 490 క్వార్టర్ల నిర్మాణం పూర్తయింది. త్వరలోనే వీటిని కార్మికులకు కేటాయించనుంది. మిగతా క్వార్టర్లు వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తి చేయనుంది. రూ.350 కోట్లతో మరో 643 డబుల్ బెడ్రూం క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 8న బోర్డ్ ఆమోద ముద్ర వేసింది. 18 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నది. వీటిలో కార్పొరేట్ ఏరియా కొత్తగూడెంలో 209, కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ప్రాంతంలో 353, సత్తుపల్లి ప్రాంతంలో 81 క్వార్టర్లను నిర్మించాలని నిర్ణయించింది.
సంక్షేమంలోనూ ముందంజ
సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కారుణ్య నియామకాలను అమలు చేస్తున్నది. ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందిస్తున్నది. ఇంటి నిర్మాణానికి బ్యాంకులో తీసుకున్న రూ.10 లక్షల రుణంపై వడ్డీ చెల్లిస్తున్నది. మ్యాచింగ్ గ్రాంట్ను పది రెట్లు పెంచింది. ఐఐటీ, ఐఐఎం ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న ఉద్యోగుల పిల్లలకు ఫీజు చెల్లిస్తోంది. కంపెనీ క్వార్టర్లలో నివాసం ఉంటున్న కార్మికులకు ఏసీలకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. ప్రప్రథమంగా రెండేండ్ల చైల్డ్కేర్ లీవ్ను అమలు చేస్తున్నది. డిస్మిస్డ్ కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చింది. లాభాల వాటా ఉద్యోగులకు ఇస్తున్నది. ప్రభావిత గ్రామాల్లో ఇతోధికంగా సీఎస్సార్ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నది. ఇందుకోసం గతేడాది రూ.34.34 కోట్లు, ఈ ఏడాది రూ.40కోట్లను కేటాయించింది. సింగరేణి సేవా సమితి ద్వారా వివిధ శిక్షణ కార్యక్రమాలు అందిస్తూ నిరుద్యోగ యువత. మహిళలకు అండగా నిలుస్తున్నది.
జైపూర్లో మరో ప్లాంట్
మంచిర్యాల జిల్లా జైపూర్లో ఏర్పాటు చేసిన 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇప్పటికే అత్యుత్తమ పీఎల్ఎఫ్తో ముందుకు సాగుతున్నది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో రికార్డుల పరంపర కొనసాగిస్తున్నది. ఇదే క్రమంలో జైపూర్లోనే మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోద ముద్ర వేసింది. ఈ విద్యుత్ కేంద్రానికి రూ.6,789.96 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
సింగరేణి చరిత్ర..
పూర్వీకుల కథనం ప్రకారం.. భద్రాచలం రామున్ని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు మార్గమధ్యంలో వంటకోసం పొయ్యిలను ఏర్పాటు చేసుకోగా, అవి మండడంతో తొలిసారిగా బొగ్గు ఖనిజం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం జియాలజిస్ట్ డాక్టర్ విలియం కింగ్ను ఇల్లెందు ప్రాంతంలో పరిశోధనలు చేయాలని పంపించింది. 1871 సంవత్సరంలో బొగ్గు నిల్వలు ఉన్నట్లు మొదటగా ఆయన గుర్తించారు. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ బొగ్గు తవ్వకాలకు లండన్లో హక్కులు పొందింది. ఇల్లెందుకు సమీపంలోని సింగరేణి గ్రామం వద్ద 1889లో తొలిసారిగా బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. 1920 వరకు హైదరాబాద్ దక్కన్ కంపెనీ పేరుతోనే తవ్వకాలు జరిగాయి. ఆ తరువాత 1920 డిసెంబర్ 23న హైదరాబాద్ దక్కన్ కంపెనీ పేరును ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’గా మార్చారు. 1945లో హైదరాబాద్ రాష్ట్ర నిజాం సింగరేణి షేర్స్ను కొనుగోలు చేసి సంస్థ యాజమాన్యాన్ని స్వీకరించింది. దీంతో దేశంలో తొలి ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది. దేశ స్వాతంత్య్రం అనంతరం 1950లో ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోకి వచ్చింది. 1965లో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా మారడం వల్ల అప్పటి నుంచి ఉమ్మడి సంస్థగా 49:51 షేర్ల భాగస్వామ్యంతో కొనసాగుతున్నది.
ఆరు జిల్లాల్లో నిక్షేపాలు…
గోదావరి ప్రాణహిత లోయ ప్రాంతాల్లో దేశ అవసరాల కోసం బొగ్గు తవ్వకాలను సింగరేణి చేపట్టింది. తొలుత 1889లో ఇల్లెందు ఏరియాలో ప్రారంభించిన తవ్వకాలు, 1928లో బెల్లంపల్లి, 1937లో కొత్తగూడెం చేరుకున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1961లో మందమర్రి, రామగుండం ఏరియాలు, 1975లో శ్రీరాంపూర్, మణుగూరు, 1991లో భూపాలపల్లి ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 11 ఏరియాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సింగరేణి బొగ్గు వెలికితీస్తున్నది.
ఇతర రాష్ర్టాల్లోకి విస్తరణ
దేశంలోని ప్రభుత్వరంగ బొగ్గు పరిశ్రమల్లోకెళ్లా మేటిగా నిలుస్తూ వస్తున్న సంస్థ ఇతర రాష్ర్టాల్లో అడిగిడుతున్నది. ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు బ్లాక్ను దక్కించుకుంది. 340.78 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసే అవకాశం ఉండగా, ఇప్పటికే పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చాయి. రూ.493.30 కోట్ల అంచనాతో వచ్చే ఏడాది మార్చిలో ఈ బొగ్గు బ్లాక్ను ప్రారంభించడానికి సింగరేణి యాజమాన్యం వేగంగా ముందుకు సాగుతోంది. ప్రతి ఏటా ఈ బొగ్గు బ్లాక్ నుంచి 10 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. కొత్త గనులైన వీకే ఓసీ, కోయగూడెం బ్లాక్-3, కేకే-6, సత్తుపల్లి బ్లాక్-3 గనుల ద్వారా కూడా బొగ్గు ఉత్పత్తి చేయనుంది.
ఉద్యోగం వస్తదనుకోలే..
నాది భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం గ్రామం. బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. సింగరేణిలో ఉద్యోగం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అసిస్టెంట్ ఫోర్మెన్ నోటిఫికేషన్ రావడంతో ఐప్లె చేసి, పరీక్ష రాశా. ఉద్యోగం సాధించా. సీఎం కేసీఆర్ చొరవతోనే సింగరేణిలో ఉద్యోగాల కల్పన కొనసాగుతున్నది. నాతో పాటు 4 వేల మందికి పైగా నిరుద్యోగ యువతకు సంస్థ ఉద్యోగావకాశాలు కల్పించింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. సంస్థ అభివృద్ధిలో నావంతు కృషి తప్పకుండా ఉంటుంది.
-అజ్మీరా బికాన్, అసిస్టెంట్ ఫోర్మెన్ కేటీకే-5, భూపాలపల్లి ఏరియా
స్వరాష్ట్రంలో కల్పించిన ఉద్యోగాలు
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి సంస్థలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేశారు. కారుణ్య నియామకాలు జరిపారు. మొత్తం 9597 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇందులో ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 3025, డిపెండెంట్, కారుణ్య నియామకాల ద్వారా 5672 మందికి ఉద్యోగాలు లభించాయి. వీటితో పాటు ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా 2501 మందికి ఉద్యోగోన్నతి కల్పించారు.
ప్రప్రథమంగా రైల్వేలైన్ ఏర్పాటు
సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు రూ.927.94 కోట్లతో 54.10 కిలోమీటర్ల దూరం రైల్వే లైన్ను ప్రప్రథమంగా రైల్వే భాగస్వామ్యంతో సింగరేణి సంస్థ నిర్మించింది. ఇందులో సింగరేణి సంస్థ రూ.618.55 కోట్లు, రైల్వే శాఖ రూ.309.39 కోట్లు వెచ్చించింది. ఈ సంవత్సరం మే నెల 28న ఈ రైల్వే లైన్ను ప్రారంభించింది.