కోటపల్లి : విదేశీ విద్యా ఓవర్సీస్ పథకంలోని సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ సూచించారు. శాసనమండలి సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర విద్యార్థులకు విదేశాలలో విద్యనభ్యసించేందుకు ఈ స్కీమ్ను తీసుకువచ్చిందని చెప్పారు. ఎస్సీలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బీసీలకు, మైనార్టీలకు జ్యోతిబాపులే, బ్రాహ్మణులకు వివేకానంద ఓవర్సీస్ ద్వారా విద్యను అందించేందుకు ప్రభుత్వం రూ.20లక్షలను స్కాలర్షిప్ ద్వారా అందచేస్తుందన్నారు.
రాష్ట్రంలోని విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకే కుటుంబం నుంచి ఒకరికి కాకుండా ఇద్దరికి స్కాలర్ షిప్ సౌకర్యం కల్పిస్తే ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. విదేశీ విద్య ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరై కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారా చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్ను అందజేయాలన్నారు. విదేశీ విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించినందున స్కాలర్ షిప్లను అందజేయాలని సూచించారు.