కోటపల్లి, జూలై 14 : భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. సమీప గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు జలమయమయ్యాయి. గోదావరి నది ప్రవాహంతో ఇప్పటికే పాత దేవులవాడ, కొల్లూరు, రావులపల్లి గ్రామాలను అధికారులు ఖాళీ చేయించగా గోదావరి ప్రవాహంతో గురువారం దేవులవాడ, ఎర్రాయిపేట, లక్ష్మీపూర్, వెలమపల్లి, అర్జునగుట్ట, బబ్బెరచెలుక గ్రామాలను వరద నీరు ముంచెత్తగా గ్రామస్తులు ఊరిని వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రాణహిత నది ప్రవాహంతో సిర్సా, ఆలుగామ గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కోటపల్లి మండలంలోని జాతీయ రహదారి నం.63 ని గోదావరి వరద ముంచెత్తగా హైవే నీట మునిగిపోయింది. ముంపు బాధితులు ఇండ్లను ఖాళీ చేసి సమీపంలో ఉన్న పాఠశాలలు, బంధువుల ఇండ్లలో ఉంటున్నారు. ప్రాణహిత, గోదావరి నదుల ఉగ్రరూపం వల్ల గోదావరి, ప్రాణహిత నది తీరంలో సాగు చేసుకుంటున్న వేలాది ఎకరాల పత్తి నీట మునిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రభుత్వ విప్..కోటపల్లి మండలంలోని దేవులవాడ, ఎర్రాయిపేట, లక్ష్మీపూర్, వెలమపల్లి, అర్జునగుట్ట, బబ్బెరచెలుక, పాత దేవులవాడ, కొల్లూరు, రావులపల్లి గ్రామాలను గోదావరి నది, సిర్సా, ఆలుగామ గ్రామాలను ప్రాణహిత నదులు ముంచెత్తడంతో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరిస్థితిని ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులను అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
దండేపల్లి మండలంలో..
దండేపల్లి మండలంలో ఏడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు కడెం ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తివేయడంతో గోదావరి తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. గూడెం, ద్వారక గ్రామాల్లో భారీగా వరదనీరు చేరింది. అర్ధరాత్రి ఎస్ఐ సాంబమూర్తి బాధితులను పునరావస కేంద్రాలకు తరలించారు. ద్వారక పునరావస కేంద్రాల్లో ఉన్న బాధితులకు జడ్పీటీసీ గడ్డం నాగారాణి, త్రిమూర్తి ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. భారీగా వరదనీరు చేరడంతో గూడెం ఎత్తిపోతల పంప్హౌస్, సబ్స్టేషన్, ఆంజనేయస్వామి ఆలయం, జడ్పీ ఉన్నత పాఠశాల, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, చుట్టు ప్రక్కన ఉన్న ఇల్లు, దుకాణా సముదాయాలు నీట మునిగాయి. గోదావరి తీరంలో ఉన్న కొండాపూర్-ద్వారక బ్రిడ్జి నీటమునిగింది. గూడెం కొత్త బ్రిడ్జికి సమీపంలో గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
పోటెత్తిన గోదావరి ..
జైపూర్ మండలంలోని ఇందారం బ్రిడ్జికి సమానంగా గోదావరి సమానంగా ప్రవహించింది. రాజీవ్హ్రదారిపైకి వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులను ఇందారం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద అప్రమత్తంగా ఉంచారు. రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, జైపూర్ ఏసీపీ నరేందర్ పరిస్థితిని సమీక్షించారు. వారి వెంట సీఐ రాజు, ఎస్ఐ రామకృష్ణ ఉన్నారు. ఫారెస్ట్ చెక్పోస్టును మంచిర్యాల ఎఫ్డీవో సాహు, ఎఫ్ఆర్వో రమేశ్ సందర్శించారు. మండలంలోని గోదావరి తీరప్రాంతాలైన వేలాల, పౌనూర్, శివ్వారం, బెజ్జాల, కుందారం గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. పౌనూర్లో వరద బాధితులను ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. ఇందారం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడారు. వారికి ఇందారం ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. టేకుమట్ల వాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి.
రాజీవ్ రహదారికి మరమ్మతులు
జైపూర్ మండలంలోని ఇందారం వద్ద గోదావరి వరద తగ్గు ముఖం పట్టడంతో మంచిర్యాల-గోదావరిఖని రాజీవ్హ్రదారిపై రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. చెక్ పోస్టు సమీపంలో తాత్కాలికంగా వేసిన రోడ్డు బురుద, గుంతల మయం కావడంతో హెకేఆర్ రోడ్వేస్ సిబ్బంది మరమ్మతు చేపట్టారు. జైపూర్ ఎస్ఐ రామకృష్ణ పర్యవేక్షించారు. గురువారం రాత్రి కల్లా పూర్తయ్యే అకకాశమున్నది.
పునరావాస కేంద్రాలకు తరలింపు
మండంలంలోని సాలిగాంలోని పీవీ రావు ప్రాజెక్ట్ ముంపునకు గురైన బాధితులను అంగన్వాడీ కేంద్రానికి తరలించారు. జజ్జరవెల్లిలోని కొత్తపల్లిలో దుర్గం మల్లేశ్ ఇంటి గోడ కూలింది. కన్నెపల్లి ఎస్ఐ సురేశ్ వర్మ పరిశీలించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో రాధా కిషన్, ఎంపీవో సతీశ్, కార్యదర్శి రాకేశ్ పాల్గొన్నారు.
లక్షెట్టిపేటలో..
లక్షెట్టిపేట మండలం గోదావరి పరివాహక ప్రాంతాలైన వీకర్ సెక్షన్, పోతపల్లి గ్రామస్తులను ముందస్తుగా సూరారం రైతు వేదికతో పాటు పట్టణంలోని ఉర్దూ మీడియం, శ్రీసరస్వతీ శిశుమందిర్ పాఠశాలలకు తరలించి పునరావాసం కల్పించారు. పోడేటి వెంకాగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీకర్ సెక్షన్ కాలనీ వాసులకు ఆహారం అందజేశారు. వర్షం తగ్గడంతో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ బాధితులతో మాట్లాడి ఇంటికి పంపించారు. గురువారం నుంచి శుక్రవారం వరకు సుమారుగా 89.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ సతన్ కుమార్ తెలిపారు. గోదావరిలో ఇన్ఫ్లో తగ్గిందని తెలిపారు. వీఆర్ఏలను సర్పంచ్లను అలార్ట్ చేశామన్నారు. మంచిర్యాల వైపు వరద తాకిడి ఎక్కువగా ఉండడంతో పోలీసులు కరీంనగర్ చౌరస్తాలో బారికెడ్లను పెట్టి వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వరద బాధితులకు భోజనం అందజేత
మంచిర్యాల ఏసీసీ, జూలై 14 : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సాయి కుంట 5వ వార్డులోని సున్నం బట్టి వాడ లయన్స్ క్లబ్ భవనంలో సుమారు 350 మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ మహేందర్, కోశాధికారి పడాల రవీందర్, మేనేజింగ్ కమిటీ సభ్యులు సత్యపాల్ రెడ్డి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
చొప్పరిపల్లిలో ఇండ్లు నేలమట్టం
బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం చొప్పరిపల్లిలో చాపిడి జమున, కొండగొర్రె మారయ్యకు చెందిన ఇళ్లు నేలమట్టమైంది. మరికొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాలతో జడ్పీ వైస్చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గొమాస శ్రీనివాస్ ఇండ్లను పరిశీలించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమగూడెం , కన్నాల సర్పంచ్లు ప్రమీలాగౌడ్, జిల్లపల్లి స్వరూప, ఎంపీవో శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు జిల్లపల్లి వెంకటస్వామి, గోమాస శ్రీకాంత్, రాంచందర్, చదువుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పునరావాస కేంద్రం పరిశీలన
మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి కళావేదిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులకు తగిన వసతులు కల్పించాలని అధికారులను మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్తో కలిసి పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. దాతల సాయంతో అందించిన దుస్తులను అందించారు. మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం 17వ వార్డులోని బాలికల బీసీ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న ఇండ్లను పరిశీలించి, బాధితులకు సూచనలు చేశారు. కాలనీల్లోని వరద నీటిని పారిశుధ్య కార్మికులతో తొలగించారు.
ముంపు గ్రామాల పరిశీలన
మండలంలో రోటిగూడ, తపాలాపూర్, పుట్టిగూడ, కలమడుగు, ఇందన్పల్లి గ్రామాల్లో కూలిన ఇండ్లను తహసీల్దార్ ఇత్యాల్ కిషన్, ఎంపీడీవో అరుణారాణి, పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు. పునరావాస కేంద్రంలో ఉన్నవారికి ఆహారంతో పాటుగా అన్ని సౌకర్యాలను కల్పించారు. పుట్టిగూడలోని ముంపు బాధితులకు జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, ఎంపీపీ మాదాడి సరోజన, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, ఎంపీటీసీ హరిణీ అన్నదానం చేశారు.
తాండూర్ మండలంలో..
మండలంలోని గోపాల్ నగర్లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను గురువారం ఎంపీడీవో ప్రవీణ్కుమార్, సర్పంచ్ గజ్జెల బక్కమ్మతో కలిసి ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్ పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివసించే వారిని ఖాళీ చేయించి ప్రభుత్వ పాఠశాల భవనాలకు తరలించి వసతి కల్పించారు. వారి వెంట ఎంపీవో సత్యనారాయణ, కార్యదర్శి, తదితరులు ఉన్నారు.
వరదలో చిక్కుకున్న వారిని కాపాడిన స్థానికులు
కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామం సమీపంలోని జాతీయ రహదారి జిన్నింగ్ మిల్లో పనిచేస్తున్న కార్మికులను స్థానికులు కాపాడారు. జిన్నింగ్ మిల్లులో పని చేసేందుకు వచ్చిన శంకర్, గణేశ్ బుధవారం రాత్రి వరకు జిన్నింగ్ మిల్లోనే నిద్రించారు. తెల్లారేసరికి వరద ప్రవాహం పెరగడంతో మిల్లులోనే ఉండి పోయారు. ఈ విషయాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాలపులపు చంద్రు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. గజ ఈతగాళ్ల రప్పించి నాటు పడవలో వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు.
యువకుడిని కాపాడిన స్థానికులు
మండలంలోని ఎర్రవాగుపై ప్రవహిస్తున్న వరద నీటి నుంచి నందులపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాంచందర్ స్కూటీపై వస్తుండగా ప్రమాదవశాత్తూ యువకుడు కల్వర్ట్లో పడిపోయాడు. ప్రవాహంలో కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న యువకులు కాపాడారు.