మంచిర్యాలటౌన్ : ఆడబిడ్డల ఆనందమే ఏకైక లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మహిళకు బతుకమ్మ చీరను అందజేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే, కలెక్టర్ పాల్గొని బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ మహిళలకు ముఖ్యమైన అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని, మహిళలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారని, ఇలాంటి పండుగను పేద కుటుంబాలు సైతం ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో చీరలను ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్నారని అన్నారు.
మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని, అందులో కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడపడుచు పెళ్లికి లక్షా నూట పదహారు ఇస్తున్నారని, ఆస్పత్రిలో డెలివరీ అయితే రూ. 13వేలతో పాటు కేసీఆర్ కిట్ను అందిస్తున్నారని , గర్భిణులకు పోషకాహారాన్ని అందిస్తున్నారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహంతో, సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆకర్షణీయమైన రంగుల్లో చీరలను పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, తాసీల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.