సత్ఫలితాలు ఇస్తున్న 102 అంబులెన్స్ సేవలు
రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మొదటిస్థానం
ఏడు నెలలు.. 47,254 ట్రిప్పులు n 1,37,269 మందికి సేవలు
నిరుపేద గర్భిణులు.. బాలింతలకు వరం
మంచిర్యాల, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ);మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పేరిట ‘102’ అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకురాగా సత్ఫలితాలిస్తున్నాయి. ఫోన్ చేసిన వెంటనే ఆపదలోనున్న గర్భిణులను సకాలంలో దవాఖానలకు చేర్చి, ప్రసవానంతరం తిరిగి తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఇప్పటి వరకు 47,254 ట్రిప్పులు వేసి 1,37,269 మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. మెరుగైన సేవలందించి రాష్ట్రస్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మొదటి స్థానంలో నిలుపగా, సిబ్బందికి ప్రశంసలు అందుతున్నాయి.
సేవల్లో ప్రథమం..
102 అంబులెన్స్ సేవల్లో రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 13 వాహనాలు ఉండగా.. ఫిబ్రవరి నెలలో 1,816 ట్రిపులు కొట్టి 4,632 మంది లబ్ధిదారులకు సేవలందించాయి. మార్చిలో 1,994 ట్రిపులు.. 5273, ఏప్రిల్లో 1,680 ట్రిప్పులతో 3,786, మేలో 1,917 ట్రిప్పులు.. 4,303, జూన్లో 2,123 ట్రిప్పులు.. 6,796, జూలైలో 2,137 ట్రిప్పులు 6,934, ఆగస్టులో 2,002 ట్రిప్పులు.. 6,963 మందిని తమ గమ్య స్థానాలకు చేర్చాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 వాహనాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో 2,559 ట్రిప్పులు.. 7,121, మార్చిలో 3012 ట్రిప్పులు.. 8,662, ఏప్రిల్లో 2,578 ట్రిపులు.. 7,515, మేలో 2,316 ట్రిప్పులు.. 6,253, జూన్లో 2,271 ట్రిప్పులు.. 6,570, జూలైలో 2,315 ట్రిప్పులు..
6,475, ఆగస్టులో 1,975 ట్రిప్పులతో 6,142 మంది సేవలు పొందారు.
మంచిర్యాల జిల్లాలో 10 వాహనాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో 1,613 ట్రిప్పులు కొట్టగా 4,209, మార్చిలో 1,736 ట్రిప్పులు 4,500, ఏప్రిల్లో 1,535 ట్రిప్పులు 3,978, మేలో 1,647 ట్రిప్పులు 4,101, జూన్లో 1,786 ట్రిప్పులు 4,921, జూలైలో 1,871 ట్రిప్పులు 5,202, ఆగస్టులో 1,687 ట్రిప్పులతో 5,196 మంది లబ్ధిపొందారు.
నిర్మల్ జిల్లాలో 102 అంబులెన్స్లు 5 సేవలందిస్తున్నాయి. ఈ వాహనాలు ఫిబ్రవరిలో 724 ట్రిప్పులతో 2,918, మార్చి లో 746 ట్రిప్పులతో 2,798..ఏప్రిల్లో 516 ట్రిప్పులు 1300, మేలో 494 ట్రిప్పులు 742, జూన్లో 776 ట్రి ప్పులు 3,895.. జూలైలో 782 ట్రిప్పులు 3,616, ఆగస్టులో 646 ట్రిప్పులతో 2,468 మందికి సేవలందాయి.
తల్లీబిడ్డల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘102’ అంబులెన్స్(అమ్మ ఒడి) సత్ఫలితాలిస్తున్నది. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం, ప్రసవానంతరం కూడా బాలింతలు, పిల్లలకు సేవలందిస్తూ బాసటగా నిలుస్తున్నది. 102 సేవల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 43 వాహనాలు ఉండగా.. ఇందులో ఆదిలాబాద్లో 13, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 15, మంచిర్యాలలో 10, నిర్మల్లో 5 వాహనాలు ఉన్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు మెరుగుపడడంతో అంబులెన్స్లు కూడా అదేస్థాయిలో లబ్ధిదారులకు ఉపయోగపడుతున్నాయి. గర్భిణులు ఏడో నెల నుంచి మూడు చెకప్లకు దవాఖానకు వెళ్లాల్సి ఉంటుంది. వీరిని దవాఖానకు తీసుకెళ్లడం, మళ్లీ తిరిగి ఇంటివద్దకు చేర్చడానికి వాహనాలు ఉపయోగపడుతున్నాయి. ఫిబ్రవరి 21,2021 నుంచి 47,254 ట్రిప్పులతో 1,37,269 మందికి సేవలందించాయి.
పైసా ఖర్చులేకుండా..
నాకు ఆగస్టు 17వ తేదీన పురిటి నొప్పులు వచ్చిన య్. 102 అంబులెన్స్కు ఫోన్ చేసిన. వెంటనే వచ్చి మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయారు. అదే రోజు కూతురు పుట్టింది. 26వ తేదీన డిశ్చార్జ్ చేశారు. మళ్లా 102 అంబులెన్స్లోనే క్షేమంగా తీసుకొ చ్చి మా ఇంటికాడ దించివెళ్లారు. పైసా ఖర్చు లేకుండా సకాలంలో స్పందించి దవాఖానలో చేర్పించడం వల్ల నేను.. నా బిడ్డ బాగున్నాం. ఇందుకు 102 సిబ్బందికి కృతజ్ఞతలు. – జలపల్లి శైలజ, రాంపూర్, కోటపల్లి మండలం
రాష్ట్రంలోనే అత్యున్నత సేవలు
102 అంబులెన్స్ సేవల్లో రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, 102 వాహన చోదకులు, వైద్య సిబ్బంది సమన్వయం, సహకారంతోనే అత్యుత్తమ సేవలందిస్తున్నాం. ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సేవలను మెరుగ్గా అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తాం. సేవల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
అందరికీ సేవలందిస్తున్నాం..
ప్రభుత్వ దవాఖానల్లో షెడ్యూలు ప్రకారం జరిగే ఏఎన్సీ వైద్య పరీక్షలు, వ్యాక్సినేషన్, స్కానింగ్లకు అనుకూలంగా వాహనాలు కేటాయిస్తున్నాం. మాకు ఫోన్లు రాగానే వెంటనే స్పందించి వాహనాలను పంపిస్తున్నాం. అవసరానికి తగిన సంఖ్యలో వాహనాలను కేటాయించి ప్రతి ఒక్కరికీ సేవలు అందేలా చూస్తున్నాం.