పెంచికల్పేట్లో కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ
హాజరైన ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్
వధూవరులకు వస్ర్తాలు, మంగళసూత్రాల పంపిణీ
పాల్గొన్న కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ సురేశ్
రాష్ట్రంలో నంబర్ వన్ ఎమ్మెల్యే కోనప్ప : విప్
పెంచికల్పేట్, ఫిబ్రవరి 6: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ వేడుక ఆదివారం అట్టహాసంగా నిర్వహిం చారు. వంద జంటలు ఈ వేడుకలో పెండ్లి ద్వారా ఒక్కటవగా, బంధువులు, స్థానికుల రాకతో వేడుక మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ సురేశ్ హాజరై వధూవరులను ఆశీర్వదించి.. మంగళసూత్రాలు, వస్ర్తాలు అందజేశారు. కోనప్ప చేపట్టిన కార్యక్రమాలు, సేవలను అతిథులు అభినందించారు. నంబర్వన్ ఎమ్మెల్యే అంటూ కొనియాడారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి ఏకంగా వంద జంటల పెండ్లి వేడుకలకు వేదికైంది పెంచికల్ పేట్ మండలంలోని వీరభద్ర సమేత భద్రకాళీ మాత ఆలయ ప్రాంగణం. కోనేరు ట్రస్ట్, ఎమ్మెల్యే సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించగా, వివాహ తంతు అట్టహాసంగా సాగింది. ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ సురేశ్ కుమార్ ఇందులో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న బాల్కసుమన్, దండె విఠల్కు మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కోనేరు ట్రస్ట్ చైర్మన్ వంశీకృష్ణ ఘనస్వాగతం పలికారు. 100 జంటలకు ప్రభుత్వ విప్ చేతుల మీదుగా మంగళ సూత్రాలు,వ స్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ సుమన్ మాట్లాడుతూ ఉచితంగా ప్రజలకు ఆరోగ్యం, పేదలకు విద్య, విద్యార్థులకు ఉపాధ్యాయ, పోలీసు శిక్షణ, గిరిజన గ్రామాలకు ఆరోగ్యం పట్ల అంబులెన్స్ అందజేత, పౌష్టికాహార కిట్లు, నిత్యాన్నదానం, సామూహిక వివాహాలు, ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న ఏకైక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అని కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలమంతా సర్వీస్ కోనప్ప అని పిలుస్తామని, సామూహిక వివాహాలను ఇంత పెద్ద ఎత్తున యజ్ఞంలా చేయడం మహాగొప్ప కార్యక్రమమని అభినందించారు.
ఇలాంటి ఎమ్మెల్యేలు దొరకడం సిర్పూర్ ప్రజల అదృష్టమని, అనుకోకుండానే మీ నియోజకవర్గానికి ఒకటో నంబర్ వచ్చిందని, దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో కోనప్ప నంబర్ వన్ ఎమ్మెల్యేగా పేరు పొందుతున్నాడని పేర్కొన్నారు. గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కోనప్పకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వార్దా నదిపై బ్యారేజీ నిర్మింపజేసి ఈ మూడు నియోజకవర్గ ప్రజలకు నీరు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేయిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొండి పట్టుపట్టి ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కోనప్ప కృషి ఎంతో ఉందన్నారు. దండె విఠల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు 511 జంటలకు సామూహిక వివాహం జరిపించిన గొప్పనేత కోనప్ప అని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు నామీద నమ్మకంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని, బతికి ఉన్నంత కాలం ప్రజా సేవకు పరితపిస్తూ పనిచేస్తానని అన్నారు. భద్రకాళి ఆలయంలో ఆదివారం 100 జంటల వివాహ వేడుకకు సహకరించిన దాతలు, వారం రోజులుగా కష్టపడుతూ ఏర్పాట్లు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కోనేరు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సామూహిక వివాహాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెంచికల్ పేట్ వైద్యాధికారి ముస్తఫా ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. వేద పండితులు కమలాకర్ శర్మ బృందం, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ గిరీశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, ఎంపీపీ జాజిమొగ్గ సుజాత, శ్రీనివాస్, జడ్పీటీసీ సముద్రాల సరిత రాజన్న, దహెగాం ఎంపీపీ కంభగోని సులోచన సంతోష్గౌడ్, జడ్పీటీసీ తాళ్లపెల్లి రామారావు, పెంచికల్పేట్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చౌదరి తిరుపతి, మండల కో ఆప్షన్ సాజిద్, పార్టీ యువజన సంఘం అధ్యక్షుడు శశికుమార్, పలు మండలాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కోనేరు అభిమానులు, వధూవరులు, ప్రజలు పాల్గొన్నారు.
మా ఇంటిపద్దై లగ్గం చేసిండు..
మాది ఎల్లూర్ గ్రామం. చిన్న వయస్సులో తల్లి చనిపోయింది. తండ్రి రాములు రోజు కూలీ చేసి నన్ను పెంచాడు. ప్రస్తుతం సుల్తానాబాద్లో ఐదేళ్లుగా పనిచేస్తున్నా. పెళ్లి చేసుకుందాం అంటే ఇల్లు లేదు.. స్థోమత లేక కూలీ చేస్తూ బ్రతుకుతున్న. మా ఎమ్మెల్యే సామూహిక పెండ్లిళ్లు చేస్తున్నడని తెలిసి దరఖాస్తు చేసుకున్న. ఈ రోజు కాళికామాత ఆలయంలో మా ఇంటి పద్దై కోనప్ప సారే మా లగ్గం చేసిండు. ఎమ్మెల్యే కోనప్ప సారు జీవితాంతం రుణపడి ఉంటా.
-గావిడె పోశాలు