మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 3 : తెలంగాణ ప్రభు త్వం అన్ని వర్గాలవారికి చేయూతనందిస్తున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు చెరువులు, కుంటల్లో ఉచి త చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అంతేకాకుండా చేపలు, చేపపిల్లల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతోనే రాయితీలను కూడా రైతులకు కల్పిస్తూ అండగా నిలుస్తున్నది. చెరువులు తవ్వుకునేందుకు ప్రోత్సహిస్తూ కేటగిరీలవారిగా సబ్సిడీ అందిస్తున్నది. దీంతో చేలకు ఉపయోగపడని భూముల్లో చేపలు పెంచేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు చెన్నూర్ నియోజకవర్గంలో 18 మంది, మంచిర్యాలలో నలుగురు, ఖానాపూర్లోని జన్నారంలో నలుగురు, బెల్లంపల్లిలో 16 మంది లబ్ధిదారులు చెరువులు నిర్మించుకుంటున్నారు. ఇందులో కొన్ని చెరువులు పూర్తికాగా మరికొన్ని చివరి దశలో ఉన్నాయి.
రెండున్నర ఎకరాలలో చెరువు నిర్మాణానికి యూనిట్ ఖర్చు ఏడు లక్షలు కాగా అర్హులైన రైతులలో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 60 శాతం సబ్సిడీ, జనరల్కు 40 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందిస్తున్నది. ఇప్పటి వరకు 42 మంది లబ్ధిదారులు చెరువులు నిర్మించుకుంటున్నారు. సబ్సిడీని అందుకున్న వారిలో జనరల్ 18 మంది, ఐదుగురు ఎస్సీలు, 19 మహిళలు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ సబ్సిడీని ఉపయోగించుకొని చేపల చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు.
రైతులు తమ సొంత భూమిలో కూడా చేప పిల్లలను పెంచుకోవచ్చు. దీనికోసం ముందుగా తమ భూముల్లో చెరువుల నిర్మాణానికి కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లాస్థాయి కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. సంవృద్ధిగా నీటి వసతి, నీరు ఇంకని స్వభావం కలిగి ఉండి సొంత భూమి ఉన్న రైతులందరు అర్హులే. అయితే ఆ భూమిపై(పట్టా లేదా లీజు) పూర్తి హక్కులు రైతులే కలిగి ఉండాలి. తక్కువ సారవంతమైనది లేదా వ్యవసాయానికి ఉపయోగపడనిదై ఉండాలి. కనీస భూమి హెక్టారు(రెండున్నర ఎకరాలు) ఉండాలి. అలాగే బోరు, బావి నీటి లభ్యత కాకుండా సాగునీటి కాలువల ద్వారా నీరు పారే సౌకర్యం ఉండాలి. అనుమతి లభించిన తరువాత అనుమతి ఉన్న స్వదేశీ చేపలను మాత్రమే పెంచాలి. జిల్లాస్థాయి కమిటీ అనుమతి పొందిన వెంటనే చేప పిల్లలను పెంచుకునేందుకు చెరువు నిర్మాణానికి సబ్సిడీ రుణం మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
మంచిర్యాల జిల్లాలో 2020-21, 2021-22 సంవత్సరాలకు 140 దరఖాస్తులు రాగా ఇందులో 61 దరఖాస్తులను జిల్లా కమిటీ ద్వారా ఎంపిక చేసి రాష్ట్రస్థాయి కమిటీకి పంపించాం. ఇందులో ఇప్పటివరకు 42 చేపల పెంపక చెరువులు మంజూరు చేశారు. అలాగే 2022-23 సంవత్సరానికి ఇప్పటి వరకు 80 దరఖాస్తులు రాగా వాటిని జిల్లా స్థాయి కమిటీ ద్వారా తనిఖీ చేసి అర్హతలున్న వాటికి మంజూరు చేస్తాం. అలాగే మంజూరైన చెరువులలో సాంకేతిక లెక్కల ప్రకారం చెరువులు, కుంటల్లో నిలువ సామర్థ్యం 50 మిల్లీ మీటర్ల సైజు గల ఫింగర్లింగ్స్ హెక్టారుకు 500, రిజర్వాయర్లలో 80-100 మిల్లీ మీటర్ల సైజు గల చేప పిల్లలను హెక్టారుకు రెండు వేల చొప్పున వదలాలి.
– సత్యనారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి, మంచిర్యాల.