ఖానాపూర్ టౌన్, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ సర్కారు స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలను ‘మన ఊరు-మన బడి’ లో ఎంపిక చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటు గా మారుస్తున్నది. ఖానాపూర్ మండలంలోని 17 ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను అన్ని వసతులతో విద్యార్థులకు అనువుగా సుందరంగా తీర్చిదిద్దుతున్నది.
ఆయా పాఠశాలల్లో మరమ్మతులతో పాటు అవసరమైన చోట వంటగదులు, డైనింగ్ హాళ్లను నిర్మిస్తున్నది. మొదటి విడుతలో ఖానాపూర్ మున్సిపాలిటీలో 2, 24 పంచాయతీల్లో 15 పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, మౌళిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.94 కోట్లు మంజూరు చేసింది.
ఇందులో ఖానాపూర్ బాలికల ఉన్నత పాఠశాలకు రూ. 27.99 లక్షలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ. 130.63 లక్షలు, సత్తనపెల్లి ప్రాథమిక పాఠశాలకు రూ. 2.26 లక్షలు, సుర్జాపూర్ ప్రాథమిక పాఠశాలకు రూ. 3.85 లక్షలు, కొత్తవాడ ప్రాథమిక పాఠశాలకు రూ. 4.60 లక్షలు, చింతల్పేట్ ప్రాథమిక పాఠశాలకు రూ. 5.27 లక్షలు, మాస్కాపూర్ ప్రాథమిక పాఠశాలకు రూ. 6.26 లక్షలు, గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలకు రూ. 12.53 లక్షలు, భీర్నంది ప్రాథమిక పాఠశాలకు రూ.16.12 లక్షలు, సుర్జాపూర్ ప్రాథమిక పాఠశాలకు రూ. 17.16 లక్షలు, రాజురా ప్రాథమిక పాఠశాలకు రూ.18.23 లక్షలు, సుర్జాపూర్ జిల్లాపరిషత్ పాఠశాలకు రూ. 19.72 లక్షలు, సత్తనపెల్లి జిల్లాపరిషత్ పాఠశాలకు రూ. 23.75 లక్షలు, రాజురా జిల్లా పరిషత్ పాఠశాలకు రూ. 23.93 లక్షలు, భీర్నంది జిల్లా పరిషత్ పాఠశాలకు రూ. 38.87 లక్షలు, బాదనకుర్తి ప్రాథమిక పాఠశాలకు రూ. 99.34 లక్షలు, మస్కాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలకు రూ. 149. 88 లక్షలు ప్రభుత్వం మంజూ రు చేసింది. కాంట్రాక్టర్లు గడువులోగా పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు చేపట్టేందుకు ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
‘మన ఊరు మన బడి’ కింద మంజూరైన నిధులతో పాఠశాలలు మెరుగు పడుతున్నాయి. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా మౌళిక సదుపాయాలు చేకూర్చేందుకు కృషి చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, కింద టైల్స్, లైట్లు, ఫ్యాన్లు, టాయిలెట్స్, వంట గదులు, డైనింగ్ హాల్స్, ప్రహరీ నిర్మాణం, నీటి తొట్టెలు, నల్లాలు, నీటి ట్యాంకుల ఏర్పాటు తదితర మరమ్మతులు చురుగ్గా చేస్తున్నారు.
‘మన ఊరు- మనబడి’తో పూర్తి స్థాయిలో విద్యార్థులకు మౌళిక వసతులు సమకూరుతున్నాయి. అన్ని సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థుల హాజరుశాతం పెరిగింది. సౌకర్యాలు కల్పిస్తుండడం తో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రెండు భాషల్లో పుస్తకాలను ముద్రిస్తుండడంతో విద్యార్థులు సులువుగా ఆంగ్ల మాధ్యమాన్ని నేర్చుకుంటున్నారు.
మేకల లింగమూర్తి, ఉపాధ్యాయుడు, మస్కాపూర్
ఖానాపూర్ సబ్ డివిజన్లో చేపట్టిన మన ఊరు-మన బడి పనుల్లో నాణ్యతను పర్యవేక్షిస్తున్నాం. గడువులోగా పూర్తి చేసి విద్యార్థులకు అన్ని వసతులను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఖానాపూర్ మండలంలోని 17 పాఠశాలల అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. 6.94 కోట్లు మంజూరు చేసింది. మన ఊరు-మన బడి తో పూర్తి స్థాయిలో వసతులను సమకూర్చి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు సైతం ఆసక్తి చూపుతున్నారు.
మాధుసూదన్, ఎంఈవో, ఖానాపూర్