మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తలమడుగు నుంచి పవిత్ర గంగాజలంతో బయలుదేరిన మెస్రం వంశీయులు మంగళవారం సూర్యోదయానికి ముందే ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయ పూజలు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. రాత్రి మర్రిచెట్టు వద్దకు చేరుకొని, ఝరిని మోత్కాకు చెట్టుపై తెల్లని వస్త్రంతో కట్టి భద్రపర్చారు. అక్కడే ప్రత్యేక పూజలు చేసి, ప్రత్యేక గుడారాలు వేసుకొని కుటుంబ సమేతంగా బస చేశారు. ఇక్కడే నాలుగు రోజులు ఉండి 21న గోవాడ్కు చేరుకోనున్నారు.
ఇంద్రవెల్లి, జనవరి17 : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తలమడుగు నుంచి పవిత్ర గంగాజలంతో బయల్దేరిన మెస్రం వంశీయులు.. మంగళవారం సూర్యోదయానికి ముందే ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. వీరికి మెస్రం వంశీయులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఇంద్రాదేవికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. సాయంత్రం వరకు ఇక్కడే బస చేశారు. ఇక్కడి నుంచి సంప్రదాయ వాయిధ్యాలు వాయిస్తూ గంగాజలంతో కాలినడకన రాత్రికి కెస్లాపూర్ మర్రిచెట్ల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర గంగాజలం ఝరిని మర్రిచెట్ల ప్రాంతంలోని మోదుగ చెట్టుపై తెల్లని వస్త్రంలో కట్టి భద్రపరిచారు.
ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేసుకొని కుటంబ సమేతంగా బసచేశారు. బుధవారం రాత్రి మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్తోపాటు, మెస్రం వంశీయుల పటేళ్లు మర్రిచెట్లకు చేరుకొని, 21న నాగోబాకు నిర్వహించే మహాపూజలతోపాటు తూమ్(పిండప్రదానం)పూజల నిర్వహణపై చర్చించనున్నట్లు మెస్రం వంశీయుల పెద్దలు తెలిపారు. మర్రిచెట్ల వద్ద నాలుగు రోజులపాటు బసచేయనున్నట్లు పేర్కొన్నారు. 21న మర్రిచెట్ల నుంచి గోవాడ్కు చేరుకోనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మెస్రం కోసు కటోడ, పర్ధాంజీ మెస్రం దాదారావ్, కోసేరావ్ కటోడ, నాగోబా పేన్ కోత్వాల్ తిరుపతి, నాయక్వాడీ మెస్రం ధర్ము, కటోడ హనుమంత్రావ్, మెస్రం వంశీయులు గణపతి, కార్తీక్, మారుతి తదితరులు పాల్గొన్నారు.