కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురియడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 3,037 ఎకరాలు, మక్క 24, పెసర 32, నువ్వులు 4 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పెంచికల్పేట్, కాగజ్నగర్ మండలాల్లో అధికంగా నష్టం కలిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఒక్క పెంచికల్పేట్ మండలంలోనే 2 వేల ఎకరాలకు పైగా వరికి నష్టం కలిగినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
సిర్పూర్(టీ) మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన మోర్లే నాగయ్యకు చెందిన ఎద్దు, లింగాపూర్ మండల కేంద్రంలో రాథోడ్ సాహెబ్రావుకు చెందిన మరో ఎద్దు మృతిచెందింది. సిర్పూర్(యు) మండలంలోని రాఘాపూర్ గ్రామానికి చెందిన కోవ బాదిరావ్ చేను వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా, తెగిపడిన విద్యుత్ తీగకు తగిలి షాక్తో చనిపోయాడు. అకాల వర్షాలతో పంటల నష్టాన్ని అంచనా వేయాలని సర్కారు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే చేస్తున్నారు. పిడుగుపాటు గురై చనిపోయిన పశువుల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు.