చింతలమానేపల్లి, మే 9 : పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యాపారులు కనీసం చెక్పోస్టులను సైతం లెక్క చేయడం లేదు. మహారాష్ట్రలోని గడ్జిరోలి జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు లారీలు శనివారం ఉదయం చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామం వద్ద అంతరాష్ట్ర వంతెన మీదుగా వచ్చాయి. గూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద ఒక లారీ ఆపకుండా15 కిలో మీటర్లు ముందుకు వెళ్లింది. దీంతో పోలీసులు ముందున్న కర్జెల్లి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు పశువుల లారీని ఆపగా అందులో 33 ఎడ్లు పట్టుబడ్డాయి. గూడెం చెక్పోస్ట్ వద్ద మరోలారీని ఆపి తనిఖీ చేయగా అందులో 39 పశువులు గుర్తించగా అందులో 32 ఆవు లు, 7 చిన్న దూడలు పట్టుబడ్డాయి.
ఈ 72 పశువుల్లో దేనికి అనుమతి పత్రాలు లేకపోవడంతో అక్రమ రవాణాగా పరిగణించి 11 మందిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ జీవన్ తెలిపారు. వీరిలో 6 అదుపులో ఉండగా 5 నిందితులు పరారీలో ఉన్నారని ఎస్ఐ తెలిపారు. రెండు లారీల సీజ్ చేయడంతో పాటు పశువులను పోలీస్స్టేషన్ ఆవరణకు తరలించారు. బక్రీద్ సందర్భంగా అక్రమంగా పశువుల రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రూల్స్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సంతోష్ హెచ్చరించారు.