మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 12 : లోక్సభ ఎన్నికల నేపథ్యం లో పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటులోని అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవోలు, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవోలను, జిల్లా పంచాయతీ అధికారులకు స్థాన చలనం కల్పించారు.
ఇందులో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో) బీ శేషాద్రిని రాజన్న సిరిసిల్లా జిల్లాకు బదిలీ చేయగా, ఆయన స్థానంలో ఆదిలాబాద్ డీఆర్డీవో ఎస్ కిషన్కు, మంచిర్యాల అడిషనల్ డీఆర్డీవోగా ఆదిలాబాద్ అడిషనల్ డీఆర్డీవో రవీందర్కు బాధ్యతలు అప్పగించారు.
అలాగే మంచిర్యాల జిల్లా ప్రజాపరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) కే నరేందర్ను పెద్దపల్లి జడ్పీ సీఈవోగా బదిలీ చేస్తూ మంచిర్యాలకు ఆదిలాబాద్ జడ్పీ సీఈవో వీ గణపతికి పోస్టింగ్ ఇచ్చారు. మంచిర్యాల డిప్యూటీ సీఈవో ఆర్ లక్ష్మీనారాయణను ఆసిఫాబాద్ జడ్పీ డిప్యూటీ సీఈవోగా బదిలీ చేశారు.