ఎదులాపురం, మే 17 : లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించి కక్షిదారుల పరస్పర సమ్మతితో కేసులను పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్వీ ఆర్ఆర్ వరప్రసాద్ అన్నారు. జూన్ 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం డీఎల్ఎస్ఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్లో అత్యధికంగా కేసులు పరిష్కరించి జిల్లాను మొదటి స్థానంలో నిలిపే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కేసుల పరిష్కారం కోసం ఎవరిపై ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కోర్డు న్యాయమూర్తి శివరాంప్రసాద్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్పాండే, న్యాయమూర్తులు ప్రమీలాజైన్, సూర్యవార్ మంజుల, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, తదితరులు పాల్గొన్నారు.
వీల్చైర్లు పంపిణీ
న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వీహెల్ప్ పూర్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్, ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి దివ్యాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.