మంచిర్యాల, జూన్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. లక్ష ఎకరాలకు సాగు నీరందించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేయనుండడంతో ఆనందం వెల్లివిరుస్తున్నది. రూ.1,658 కోట్లతో మూడు లిఫ్ట్లు, మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలంలో రూ.90 కోట్లతో మరో లిఫ్ట్ను నిర్మించే పనులకు కొబ్బరికాయ కొట్టనున్నారు. ఫలితంగా చెన్నూర్ ఎత్తిపోతల పథకం ద్వారా 103 గ్రామాల్లోని 90 వేల ఎకరాలు, పర్థాన్పల్లి లిఫ్ట్తో మంచిర్యాలలో 10 వేల ఎకరాలకు నీరు అందనుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రగతి రథసారథి, అపర భగీరథుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రేపు(శుక్రవారం) మంచిర్యాల జిల్లాకు వస్తున్నారు. లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. చెన్నూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. రూ.1,658 కోట్లతో మూడు లిఫ్ట్లు, మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలంలోని పర్ధాన్పల్లిలో రూ.90 కోట్లతో మరోలిఫ్ట్ను నిర్మించే పనులకు సీఎం కొబ్బరికాయ కొట్టనున్నారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకం ద్వారా 74,270 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు 15,730 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడనుంది. మొత్తంగా చెన్నూర్ నియోజకవర్గంలోని 103 గ్రామాల్లో 90 వేల ఎకరాలకు వీటి ద్వారా సాగునీరు అందనుంది. పర్థాన్పల్లి లిఫ్ట్తో మంచిర్యాలలో 10 వేల ఎకరాలకు నీరు అందనుంది. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
కాళేశ్వరంతో అనుసంధానం..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలతో చెన్నూర్ లిఫ్ట్లను అనుసంధానం చేయనున్నారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నుంచి పంప్హౌస్ల నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు నీరు వచ్చేలా ఈ లిఫ్ట్లను డిజైన్ చేశారు.
రూ.939.50 కోట్లతో లిఫ్ట్-2
రెండో లిఫ్ట్ను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం దగ్గర నిర్మించిన సరస్వతీ బ్యారేజీ నుంచి చెన్నూరు మండలం సోమన్పల్లి వద్ద నిర్మించే పంప్హౌస్ ద్వారా ఆరేపల్లి, అస్నాద్, రెడ్డిపల్లి చెరువులను నింపుతూ 63.30 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మించనున్నారు. ఈ లింకు ద్వారా చెన్నూరు మండలంలోని 30 గ్రామాలు, భీమారం మండలంలోని 13 గ్రామాలు, కోటపల్లి మండలంలోని తొమ్మిది గ్రామాలు మొత్తం 52 గ్రామాల్లోని 48,208 ఎకరాలకు సాగు నీరు అందనుంది.
రూ.449.80 కోట్లతో లిఫ్ట్-1
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై సుందిళ్ల వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజీ నుంచి చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం శెట్పల్లి దగ్గర నిర్మించే పంప్హౌస్ ద్వారా పొన్నారం, శంకరపల్లి, గంగిపల్లి చెరువులను నింపుతూ 43.45 కిలోమీటర్ల మేర ప్రధాన కెనాల్ నిర్మించనున్నారు. ఈ లిఫ్ట్ ద్వారా జైపూర్ మండలంలోని 21 గ్రామాలు, మందమర్రి మండలంలోని ఆరు గ్రామాల పరిధిలోని 25,422 ఎకరాలకు సాగు నీరు అందనుంది.
రూ.268.70 కోట్లతో లిఫ్ట్-3
చెన్నూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో లిఫ్ట్ను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద ప్రాణహితపై నిర్మించిన లక్ష్మి బ్యారేజీ నుంచి కోటపల్లి మండలం ఆల్గవ్ వద్ద నిర్మించనున్న పంప్హౌస్ ద్వారా శంకరాపూర్, ఆయపల్లి చెరువులు నింపుతూ 35.55 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వను నిర్మించనున్నారు. ఈ లిఫ్ట్ ద్వారా కోటపల్లి మండలం లోని 24 గ్రామాల్లోని 16,370 ఎకరాలకు సాగు నీరు అందనుంది.
గోస తీరనుంది..
చెన్నూర్ రూరల్, జూన్ 7 : చెన్నూర్ నియోజకవర్గంలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను సీఎం సారు ప్రారంభిస్తున్నారని తెలిసి సంతోషించాం. దీంతో చెరువులు, కుంటల్లో నీరు నిండుగా ఉండనుంది. బావులు కూడా నిండనున్నాయి. ఇక రెండు పంటలు బ్రహ్మండంగా పండించుకోవచ్చు. మహిళా, దినసరి కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది. ఇంత గొప్ప పథకాన్ని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రైతుల కోసం తీసుకురావడం గొప్ప విషయం. రైతు కుటుంబాలు సీఎం కేసీఆర్ సారుకు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు రుణపడి ఉంటాయి.
– లేతకరి రాజయ్య, రైతు, కొమ్మెర, చెన్నూర్ మండలం.
మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది..
జైపూర్, జూన్ 7 : చెన్నూర్ ఎత్తిపోతల పథకం ద్వారా మా ప్రాంతం సస్యశ్యామలంగా మారనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల పర్యటనలో చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి రూ.1,658 కోట్లతో భూమిపూజ చేయడం ఆనందంగా ఉంది. ఇప్పటికే మా ప్రాంతమంతా పచ్చని జలకళ సంతరించుకుంది. ఎత్తిపోతల పథకం పూర్తయితే పూర్తిస్థాయిలో చెన్నూర్ నియోజకవర్గంలోని 102 చెరువులకు చెన్నూర్ లిఫ్ట్ ద్వారా నీరు పారనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగు పెడుతున్నది. ఎత్తి పోతల పథకం పూర్తయితే రైతాంగం ముఖ్యమంత్రి కేసీఆర్కు, చెన్నూర్ శాసనసభ్యుడు బాల్క సుమన్కు ఋణపడి ఉంటారు.
– లేతకరి రాజయ్య, రైతు, కొమ్మెర, చెన్నూర్ మండలం