దస్తురాబాద్, ఏప్రిల్ 9 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బడుల ఆధునీకరణతో పాటు మౌలిక వసతులు వేగంగా సమకూరుతున్నాయి. నిర్మల్ జిల్లా దస్తురాబాద్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో 152 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు పాఠశాల పరిస్థితిపై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పలుమార్లు ఎమ్మెల్యేతో కలిసి సర్పంచ్ రాజమణి, ఎంపీపీ సింగరి కిషన్, వైస్ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ శారద సచివాలయానికి వెళ్లారు. ఎట్టకేలకు వీరి కృషి ఫలించింది. ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమంలో తొలి విడుతలో పాఠశాల ఎంపిక చేసింది. రూ.1.10కోట్లు మం జూరు చేసింది. ప్రసుత్తం పాఠశాల భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.1.10 కోట్లతో భవన నిర్మాణం
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం రూ.1.10కోట్లు మంజూరు చేసింది. రూ. 15.90 లక్షలతో డైనింగ్ హాల్ నిర్మాణం, తాగునీటి సరఫరా కోసం రూ.1.61లక్షలు, విద్యుత్ సౌకర్యానికి రూ.60వేలు, మరమ్మతులకు రూ.2.24 లక్షలు, తరగతి గదుల నిర్మాణానికి రూ.8.97లక్షలు మంజురు చేసింది. భవన నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి చేసి ప్రారంభమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఎమ్మెల్యే రేఖానాయక్ సహకారంతోనే..
మన ఊరు-మన బడి కింద జడ్పీ ఉన్నత పాఠశాల ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనం నిర్మించాలని ఎమ్మెల్యే రేఖా నాయక్ దృష్టికి తీసుకెళ్లాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు వివరించాం. ఎమ్మెల్యే కృషి, సహకారంతో ప్రభుత్వం మన ఊరు-మన బడి కింద జడ్పీ ఉన్నత పాఠశాల ఎంపిక చేసి నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రేఖానాయక్కు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల తరఫున ధన్యావాదాలు -నిమ్మతోట రాజమణి, సర్పంచ్, దస్తురాబాద్
చాలా సంతోషంగా ఉంది
మా పాఠశాల ప్రసుత్తం శిథిలావస్థలో ఉంది. వానకాలంలో పాఠశాల పైకప్పు పెచ్చులు ఉండి కింద పడేవి. మేము భయంగా తరగతి గదుల్లో కుర్చోని పాఠాలు వినేవాళ్ళం. మన ఊరు-మన బడి కింద పాఠశాల ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. -త్రిష, విద్యార్థి, 9వ తరగతి
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
మన ఊరు-మన బడి మంచి కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి మంచి నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం విద్యార్థుల కోసం వసతులను సమాకూర్చడం అభినందనీయం. పాఠశాలను మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎంపికకు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
–ఆకుల ఈశ్వర్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, జడ్పీహెచ్ఎస్, దస్తురాబాద్