Penchikalpet Forest | పెంచికల్పేట్, డిసెంబర్ 17 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్ రేంజ్ ఉత్తర భారతదేశంలోనే పేరుపొందిన ప్రాంతం. ఈ ఏరియా విభిన్న మొక్కల పెంపకానికి, వన్యప్రాణుల సంతతికి పెట్టింది పేరు. పెంచికల్పేట్ అటవీ క్షేత్రం పక్కల ప్రాణహిత, పెద్దవాగులు ఉంటాయి. వీటి సంగమమే పాలరాపు గుట్ట.
ఇక్కడ నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో వన్యప్రాణులు స్థిర నివాసం ఏర్పరచుకొని సంతతిని పెంపొందించుకుంటున్నాయి. ప్రధానంగా నెమళ్లు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, కొండెంగలు, కోతులు, దుప్పులు, కొండ గొర్రెలు, అడవి దున్నలు, తోడేళ్లు, పులుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వలస పక్షులు కూడా వస్తుండడంతో ఈ ప్రాంతం నిత్యం సందడిగా మారుతోంది.
వర్షాకాలంలో దుద్దులాయి, కొండెంగ లొద్ది జలపాతాలు తెల్లని పాలనూరుగ ధారలతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపుగా, లావుగా పెరిగిన పసుపు కడిమి వృక్షాలు కనిపిస్తాయి. గుండెపల్లి బేస్క్యాంప్, గడ్డి మైదానాలు, ఊట కుంటలు, సహజ వనరులు, అందమైన అటవీ పుష్పాలు ఉంటాయి. అటవీ, వన్య ప్రాణులను వేటగాళ్ల నుంచి రక్షించేందుకు ప్రత్యేక సీసీ కెమెరాలు, బృందాల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నామని పెంచికల్పేట్ ఎఫ్ఆర్వో వేణుగోపాల్ తెలిపారు.