మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం కలకలం రేపుతున్నది. కొత్త రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుండగా, అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం తిర్యాణి, లింగాపూర్, సిర్పూర్- యు మండలాలతో పాటు ప్రాణహిత పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నది. మారుమూల పల్లెల్లో విస్తృతంగా పర్యటిస్తూ అడుగడుగునా జల్లెడ పడుతున్నది. స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ సురేశ్కుమార్, అసాంఘిక శక్తులకు సహకరించవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం కలకలం రేపుతోంది. 10 నుంచి 15 మంది మావోయిస్టులు ప్రవేశించి సాధారణ వ్యక్తుల మాదిరిగా కలిసిపోయి తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అప్రమత్తమై అడవుల్లో విస్తృతంగా కూంబింగ్లు చేయడంతో పాటు మారుమూల పల్లెల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
జిల్లాలోని అడవుల్లో మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ దళం సంచరిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుతిరుగుతున్నది. 2020 సెప్టెంబర్ 20న కదంబా అడవుల్లో జరిగిన కాల్పుల్లో భాస్కర్ దళానికి చెందిన మావోయిస్టులు ఇద్దరు మృతి చెందారు. చనిపోయిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్కు చెందిన చుక్కాలు, ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్కు చెందిన జుగ్నాక బాజీరావ్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో భాస్కర్ తప్పించుకున్నాడు. అప్పటి నుంచి జిల్లాలో పోలీసులు విస్తృతంగా కూంబింగ్లు నిర్వహిస్తూ మావోయిస్టు కదలికలపై నిఘా పెట్టారు. అప్పటి నుంచి జిల్లాలో మావోయిస్టుల అలికిడి తగ్గింది. వారం రోజులుగా జిల్లాలోకి 10 నుంచి 15 మంది మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారం కలవరపెడుతున్నది. స్వయంగా ఎస్పీ సురేశ్కుమార్ గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలియజేయాలని కోరుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన తిర్యాణి మండలం తాటిగూడ, కేరిగూడ, ఎర్రబండ, లింగాపూర్ మండలం చోర్పల్లి, లెండిగూడ, మందిరితో పాటు సిర్పూర్-యూ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొత్త వ్యక్తులు, అపరిచితులు కనిపిస్తే వారిని తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టుల ఫొటోలతో ఉన్న పోస్టర్లను గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారు. మావోయిస్టులు, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం తెలియజేయాలని కోరుతున్నారు. ఏవైనా సమస్యలుంటే అధికారులు, పోలీసులకు తెలియజేయాలని వివరిస్తున్నారు. మావోయిస్టుల సమాచారాన్ని 100కు ఫోన్చేసి తెలియజేయాలని కోరుతన్నారు. మావోయిస్టుల సమాచారం అందించిన వారికి రూ. 5 నుంచి రూ. 20 లక్షల వరకు రివార్డులు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. గతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయిన తర్వాత పెంచికల్పేట్కు చెందిన ఆరుగుగురు వ్యక్తులు మావోయిస్టుల్లో చేరడానికి సమన్నద్ధమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. తాజాగా.. జిల్లాలో మళ్లీ మావోయిస్టులు ప్రవేశించి కొత్త రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి అటవీప్రాంత పల్లెల్లో భయాందోళనలు నెలకొన్నాయి.