కుమ్రం భీం ఆసిఫాబాద్ : దళిత బంధు పేరుతో షెడ్యూలు కులాల వారికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్ లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే కోనప్ప తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా బాబు జగ్జీవన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 117 మంది లబ్ధిదారులను మొదటి విడతలో ఎంపిక చేశామన్నారు. దీనిలో 18 మందికి రెబ్బెనలో డెయిరీ యూనిట్స్, ఎనిమిది మందికి ట్రాన్స్పోర్ట్ వాహనాలు అందించనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో మిగతా లబ్ధిదారులకు ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని తెలిపారు. అంబేద్కర్ ప్రతి కార్యక్రమానికి వెళ్లేటప్పుడు సూట్ ధరించేవాడని, దళిత బంధు పొందిన వారు ప్రస్తుత సంవత్సరంలో ఆర్థికంగా ఎదిగి సూటు ధరించేలా ఎదుగాలని సూచించారు.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అసలైన పేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేశామని ఏదైనా అనుమానాలు ఉంటే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పరీక్షించుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. తన నియోజకవర్గంలో దళితులకు ఎన్నో రకాల సేవలు చేస్తున్నానని ఉదాహరణలు వివరించారు. ఎస్సీ లలో అభివృద్ధి చెందిన వారు వారి జాతి అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు.