ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
మీర్జాపూర్ శివారులో పదెకరాల స్థలం కేటాయింపు
యుద్ధప్రాతిపదికన పనులు
భైంసా, ఏప్రిల్ 25 : ప్రత్యేక రాష్ట్రంలో భైంసాలో అల్లర్లకు బ్రేక్ వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలో బందోబస్తు కోసం బెటాలియన్ ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. భైంసాపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలోని మీర్జాపూర్ శివారు సర్వే నంబర్ 162లో పదెకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో యుద్ధ ప్రాతిపాదికన పనులు ప్రారంభం కానున్నాయి. రెండు దశాబ్దాలుగా భైంసా పట్టణంలో తరచూ ఇరువర్గాల ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 1992 లో మొదలైన ఘర్షణ వాతావరణం ఇప్పటికీ కొనసాగుతున్నది. దేశంలోని చాలా సున్నిత ప్రాంతాల్లో ప్రశాంతత నెలకొంటున్నా, భైంసాలో మాత్రం తరచూ అల్లర్లు, విద్వేషాలు చెలరేగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల జరిగిన అల్లర్ల సందర్భంగా దూర ప్రాంతాల నుంచి పోలీస్ బలగాలు బందోబస్తు కోసం పట్టణానికి చేరుకునే సమయానికి తీవ్ర నష్టం జరిగింది. దీంతో పట్టణంలోనే అందుబాటులో పోలీస్ బలగాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని భైంసా ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడో బెటాలియన్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీకి దృష్టికి తీసుకెళ్లారు. ఐపీఎస్ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఇప్పటికే ఐపీఎస్ అధికారిని ఏర్పాటు చేసింది. దీంతో పాటు బెటాలియన్ను ఏర్పాటు చేయనుంది.