కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శ్రీకారం చుట్టిన సర్కారు
మహిళా సంఘాలకు రూ.4.67 కోట్లతో 500 గేదెల యూనిట్లు
ఇప్పటికే 100 మంది ఎంపిక.. 15 మందికి అందజేత
డిసెంబర్లోగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కసరత్తు
త్వరలో ఆసిఫాబాద్లో విజయ డెయిరీ బ్రాంచ్
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం పాల విప్లవానికి శ్రీకారం చుట్టింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రూ.4 కోట్ల 67 లక్షల 77 వేలతో 500 గేదెల యూనిట్లు మహిళా సంఘాలకు అందించాలని ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. ఇప్పటికే 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, ఇటీవల 15 మందికి పంపిణీ చేసింది. ఒక్కో యూనిట్కు రూ. 93,554 చొప్పున అందిస్తుండగా, డిసెంబర్కల్లా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది. మరోవైపు వచ్చే ఏడాది మార్చిలోగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో విజయ డెయిరీ బ్రాంచ్ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
జిల్లాలో మహిళా సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా గేదెలను అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఒక్కో యూనిట్కు రూ. 93,554 అందిస్తున్నారు. గేదెల పెంపకంపై ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేసి వారికి రుణాలను అందిస్తున్నారు. గేదె కొనుగోలుకు రూ. 75,000, దాణా కోసం రూ. 7200, రవాణా ఖర్చుల కోసం రూ. 3000 ఇవ్వనున్నారు. ఒకవేళ గేదెకు, రుణం తీసుకున్న సభ్యురాలికి ఏదైనా ప్రమాదం.. లేక మరణం కాని సంభవిస్తే డబ్బులు రికవరీ అయ్యేందుకు ప్రత్యేకంగా బీమా చేయనున్నారు. రూ. 5063 సాధారణ బీమా చేయనున్నారు. గేదెను తీసుకువచ్చే సమయంలో కూడా రూ. 750తో బీమా చేస్తారు. మూల ధనం వాటా కింద రూ. 1704, నాలుగు సంవత్సరాల సురక్ష బీమా కోసం రూ. 837 చెల్లిస్తారు. మొత్తంగా ఒక గేదె కోసం బీమా, రవాణా, మూల ధనం వాటా, సురక్షా బీమా, గేదె కొనుగోలు ఇలా అన్నీ కలిపి సభ్యురాలికి రూ. 93,554 అందిస్తారు.
మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా..
మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి అవరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తారు. డెయిరీ ఫాం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చు. మేలు రకం గేదెలను కొనుగోలు చేయడం ద్వారా కనీసం రోజుకు 10 నుంచి 12 లీటర్ల పాలు ఇచ్చే విధంగా చూస్తారు. లీటరు పాలకు రూ. 60 చొప్పునా విక్రయించినా రోజుకు రూ. 600 నుంచి రూ. 700 వరకు సంపాదించవచ్చు. మొదటి నాలుగు నెలల తర్వాత లోన్ రికవరీ చేయాల్సి ఉంటుంది. గేదె రవాణా చేస్తున్న సమయంలోగాని, తీసుకువచ్చిన తర్వాతగాని అది మరణించినా, లేక గేదెను తీసుకున్న సభ్యురాలు మరణించినా ఇన్సూరెన్స్ ద్వారా అధికారులు డబ్బులు రికవరీ చేసుకుంటారు.
డిసెంబర్లోగా అందించేందుకు..
జిల్లాలో రూ. 4 కోట్ల 67 లక్షలతో 500 గేదెల యూనిట్లు అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వచ్చే డిసెంబర్లోగా పూర్తిస్థాయిలో యూనిట్లను మహిళా సంఘాల సభ్యులకు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 100 మంది మహిళా సభ్యులను గేదెల పథకానికి ఎంపిక చేయగా, 15 మందికి గేదెలను అందించారు.
త్వరలో విజయ డెయిరీ..
గేదెల యూనిట్ల ద్వారా పెద్ద మొత్తంలో పాల ఉత్పత్తి కానున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో విజయ డెయిరీ బ్రాంచ్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి జిల్లా కేంద్రంలో విజయ డెయిరీని ఏర్పాటు చేయిస్తామని అంటున్నారు. కోరకున్న వారికి రెండు బర్రెలను కూడా ఇస్తామని అధికారులు చెబుతున్నారు.