పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
రామకృష్ణాపూర్, ఆగస్టు 27: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలోని పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ పనులను మున్సిపల్ కమిషనర్ జీ వెంకటనారాయణ పర్యవేక్షించారు. మున్సిపాలిటీ పరిధిలోని 8 ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలను శుభ్రం చేయిస్తూ తిరిగి పాఠశాలలు పునఃప్రారంభించడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 31లోగా అన్ని పాఠశాలలలో ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ నాయక్, వార్డు కౌన్సిలర్ జాడిశ్రీను, నాయకులు జే. కుమార్, మున్సిపల్ సిబ్బంది వసంత్ పాల్గొన్నారు.
గుడిరేవు పాఠశాలలో..
దండేపల్లి, ఆగస్టు 27 : దండేపల్లి మండలంలోని గుడిరేవు జడ్పీ ఉన్నత పాఠశాలను ఎంపీవో మేఘమాల శుక్రవారం సందర్శించారు. వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. 1వ తేదీలోపు అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పరిసరాల్లో పిచ్చి మొక్కలు తొలగించాలని, తరగతి గదుల్లో శానిటేషన్ చేయించాలన్నారు. విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ తరగతుల నిర్వహణ చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పసర్తి అనిల్కుమార్, సర్పంచ్, హెచ్ఎం, జీపీ కార్యదర్శి ఉన్నారు.
నస్పూర్లో..
సీసీసీ నస్పూర్, ఆగస్టు 27: ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించడానికి నిర్ణయించడంతో నస్పూర్ ప్రభుత్వ పాఠశాలల్లో మున్సిపల్ సిబ్బంది క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. తరగతి గదులను శుభ్రం చేసి, హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ పనులను మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠశాల ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తుంగపిండి రాజలింగు, కౌన్సిలర్ శ్రీపతి సుమతి, ఆర్ఐ వెంకటేశ్, నాయకులు శ్రీపతి మల్లేశ్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
తాండూర్ మండలంలో..
తాండూర్, ఆగస్టు 27 : మండలంలోని చౌటపల్లి, రేచిని, గోపాల్నగర్, కాసిపేట, అచ్చలాపూర్, వివిధ పాఠశాలలను శుక్రవారం ఇన్చార్జి ఎంపీడీవో వేణుగోపాల్, ఎంపీవో అక్తార్ మోయినొద్దీన్, ఎంఈవో వాసాల ప్రభాకర్తో కలిసి ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్ సందర్శించారు. పాఠశాలలను గ్రామ పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించాలని ఎంపీవోను ఆదేశించారు. కొవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట ఏపీవో నందకుమార్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.