కాసిపేట, జూన్ 25 : ఓరియంట్ సిమెంట్ కంపెనీలో నాలుగో ప్లాంట్లో స్థానికులకు, కార్మికుల పిల్లలకు ఉద్యోగావకాశాలు అందించే విధంగా కృషి చేస్తామని ఓరియంట్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పూస్కూరి రామ్మోహన్రావు పేర్కొన్నారు. శుక్రవారం కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్మోహన్రావు మాట్లాడారు. గతంలో కార్మికులకు లక్ష రూపాయలు ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ను రూ.3 లక్షలు పెంచామని, దాన్ని రూ.5 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్మికులకు మైన్ అలవెన్స్ కంపెనీ స్థాపించిన నాటి నుంచి రూపాయి మాత్రమే ఉందని, ఇప్పుడు 15 రూపాయలకు పెంచామన్నారు. క్యాంటీన్లో నాణ్యమైన టిఫిన్స్ అందిస్తామని తెలిపారు. క్వార్టర్ల ఎంపికలో పైరవీలకు తావులేకుండా డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసి క్వార్టర్లను అందిస్తున్నామన్నారు. కార్మికులకు క్లబ్, జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ పెట్టినట్లు వివరించారు. బోనస్ సైతం కరోనా కష్ట కాలంలో రూ.28,500 అందించామన్నారు. దేవాపూర్లో దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.
ప్రస్తుతం ఉన్న సింగిల్ బెడ్రూం క్వార్టర్లను డబుల్ బెడ్రూంలకు మార్చే విధంగా చూస్తున్నామని తెలిపారు. ఇంటర్ వరకు సెంట్రల్ సిలబస్తో విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులకు ఉన్న 100 యూనిట్ల ఉచిత కరెంట్ 200 యూనిట్లకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ట్రైనింగ్లో అందించే అలవెన్స్ను రూ.6500 పెంచామని గుర్తు చేశారు. వారసత్వ ఉద్యోగాలు కొనసాగుతాయని తెలిపారు. తక్కువ రేట్లకు కిరాణా సామగ్రి అందించేందుకు సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, ఓసీసీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతిరెడ్డి, టౌన్ అధ్యక్షుడు గడ్డం పురుషోత్తం, ఉపాధ్యక్షుడు బింగి శ్రీనివాస్, వడ్లూరి మల్లేశ్, నాయిడి మల్లేశ్, మడావి అనంతరావు, అట్టెపల్లి శ్రీనివాస్, ఆడె జంగు, దండవేని చందు, కార్మికులున్నారు.
రూ.7.50 లక్షలతో అంబులెన్స్ విరాళం
ఓరియంట్ కంపెనీకి అందించిన పూస్కూరి కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మికుల కోసం, గిరిజనుల కోసం తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఓసీసీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు పూస్కూరి రామ్మోహన్రావు సొంత డబ్బులు రూ.7.50 లక్షల విలువైన అంబులెన్స్ అందించారు. శుక్రవారం దేవాపూర్ ఓరియంట్ కంపెనీ ప్రధాన గేట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబులెన్స్ను ఓరియంట్ యాజమాన్యానికి మెయింటెనెన్స్ కోసం అంబులెన్స్ను ఓసీసీ ప్రెసిడెంట్ ఎస్కే పాండేకు అప్పగించారు. రామ్మోహన్రావుకు ఓసీసీ చీఫ్ ఎస్కే పాండే, కార్మికులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.