2 కోట్లకు పైగా మొక్కల పెంపకానికి కసరత్తు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామానికో నర్సరీ
పల్లెప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన సర్కారు
అటవీ, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో సంరక్షణ
ఇప్పటికే కార్యదర్శులు, వనసేవకులకు శిక్షణ పూర్తి
మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ), నవంబర్ 22 : పచ్చందాలను పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2022-23లో నిర్వహించే ఎనిమిదో విడుత కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామానికో నర్సరీ ఉండగా, వీటిలో సుమారు 2 కోట్లకుపైగా మొక్కలను పెంచాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, అటవీ శాఖలకు వీటి సంరక్షణ బాధ్యతను అప్పగించగా, కార్యదర్శులు, వనసేవకులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసింది. వానకాలం ప్రారంభం నాటికి వీటిని సిద్ధం చేయాలని భావిస్తున్నది.
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2022-23లో చేపట్టే ఎనిమిదో విడుత హరితహారానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నర్సరీల్లో సుమారు 2 కోట్లకు పైగా మొక్కల పెంపకంపై దృష్టి పెట్టారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్లలో ఇప్పటికే నర్సరీల్లో మొక్కల పెంపకానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, వనసేవకులకు శిక్షణ పూర్తి చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీ, అటవీ శాఖల ఆధ్వర్యంలో వీటి సంరక్షించనున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేశారు. అందులో వీటిని పెంచనున్నారు.
కార్యదర్శులు … వనసేవకులకు శిక్షణ…
గ్రామాల్లో హరితహారం నర్సరీల నిర్వహణ కార్యదర్శులు, వనసేవకులదే ప్రధాన పాత్ర. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. మట్టి తీసుకురావడం, కూలీలతో సేంద్రియ, రసాయన ఎరువులతో మిశ్రమాన్ని తయారు చేయించడం, సంచుల్లో మట్టిని నింపడం, వరుసల్లో పేర్చడం, విత్తనాలు వేయడం, అంటు పద్ధతిలో కొమ్మల సేకరణ, నీరు పట్టడం, మొక్కల సంరక్షణ, కలుపుతీత వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు
కలప నిచ్చే మొక్కలు : టేకు, శ్రీగంధం, వేప, నెమలినార, తుమ్మ, సోమి, నారేప, జిట్రేగి, వెదురు, పండ్ల మొక్కలు : జామ, నిమ్మ, అల్లనేరేడు, మునగ, దానిమ్మ, ఉసిరి, సీతాఫలం, బొప్పాయి.., నీడ నిచ్చే చెట్లు : రావి చెట్టు, మర్రి చెట్టు, బాదాం, కానుగ, వేప, నెమలినార, పూల మొక్కలు : గంగరావి, మల్లె, గుల్మోహర్, పారిజాతం, తబుబియా రోసియా, టెకోమ, ఇతరాలు : తెల్లమద్ది, మందార, గన్నేరు, ఈత, నందివర్ధనం.
ఆదిలాబాద్ జిల్లా..
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 468 గ్రామ పంచాయతీలు ఉండగా 52 లక్షల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రతి పంచాయతీలో కనీసం 10 వేల మొక్కలు పెంచనున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని 34 గ్రామ పంచాయతీల్లో 39 వేల మొక్కలు, బజార్హత్నూర్లో 30 పంచాయతీల్లో 30 వేలు, బేల మండలంలోని 37 పంచాయతీల్లో 37 వేలు, భీంపూర్ మండలంలోని 26 పంచాయతీల్లో 26 వేలు, బోథ్ మండలంలో 33 పంచాయతీల్లో 33 వేలు, గాదిగూడ మండలంలోని 25 పంచాయతీల్లో 25 వేలు, గుడిహత్నూర్ మండలంలోని 26 పంచాయతీల్లో 26 వేలు, ఇచ్చోడ మండలంలోని 32 పంచాయతీల్లో 42 వేలు, ఇంద్రవెల్లి మండలంలోని 28 పంచాయతీల్లో 28 వేలు, జైనథ్ మండలంలో 42 పంచాయతీల్లో 47 వేలు, మావల మండలంలోని 3 పంచాయతీల్లో 30 వేలు, నార్నూర్ మండలంలో 23 పంచాయతీల్లో 25 వేలు, నేరడిగొండ మండలంలోని 32 పంచాయతీల్లో 32 వేలు, సిరికొండ మండలంలో 19 పంచాయతీల్లో 19 వేలు, తలమడుగు మండలంలో 28 పంచాయతీల్లో 38 వేలు, తాంసి మండలంలో 13 పంచాయతీల్లో 13 వేలు, ఉట్నూర్ మండలంలో 37 పంచాయతీల్లో నర్సరీల్లో 57 వేల మొక్కలను పెంచడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో కూడా 7 లక్షల మొక్కలు పెంచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నిర్మల్ జిల్లా..
నిర్మల్ జిల్లాలో 18 మండలాల్లోని 396 జీపీల్లో 51.1 లక్షల మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజల ఆసక్తి ప్రకారం మొక్కలు ఎంపిక చేసుకోవాలని వెసులుబాటు కల్పించారు. ఇంటి ఆవరణలో పెంచుకునేందుకు ఉపయోగపడే పూలు, పండ్ల మొక్కలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నర్సరీల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి మట్టితరలింపు, మట్టిని జాలీ పట్టడం పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో పంచాయతీలో జనాభా ప్రకారం 13వేల చొప్పున మొక్కలను పెంచాలని ప్రణాళికలు రూపొందించారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలోని 310 నర్సరీల్లో గ్రామపంచాయతీ, అటవీశాఖ ఆధ్వర్యంలో 56.1 లక్షల మొక్కలు పెంచుతున్నారు. నర్సరీల్లో పెంచి, నాటించే బాధ్యత డీఆర్డీఏ, అటవీశాఖ, మున్సిపాలిటీలు, సింగరేణి సంస్థకు అప్పగించనున్నారు. ఈ మేరకు నర్సరీల పురోగతని డీఆర్డీవో శేషాద్రి, సంబంధిత అధికారులు రోజూ పరిశీలిస్తున్నారు. ఏడో విడుత హరితహారంలో భాగంగా 2021-22లో డీఆర్డీఏ, అటవీశాఖ, ఏడు మున్సిపాలిటీలు, సింగరేణి సంస్థల్లో కలిపి మొత్తంగా 40.28 లక్షల మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా నాటిన, నాటే మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లోనూ ట్రాక్టర్లు, ట్రాలీలు ఉన్నాయి. ఈ ట్యాంకర్తో ఏడాది పొడవునా మొక్కలకు నీటి సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొక్కలకు నీరు పోయడం, రక్షించేందుకు వాచ్మెన్లను కూడా ఏర్పాటు చేశారు. నర్సరీల నుంచి మొక్కలను సరఫరా చేస్తుండగా అడవులు, జాతీయ రహదారులు, గ్రామ పంచాయతీలు, ఆర్అండ్బీ రోడ్లు, ఖాళీ స్థలాల్లో ఏటా మొక్కలు నాటుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జిల్లాలోని 335 నర్సరీల్లో 50 నుంచి 60 లక్షల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది 52 లక్షల మొక్కలు నాటిన అధికారులు, ఈ ఏడాది కూడా 50 లక్షల మొక్కలు నాటాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రతి పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి 15 వేల నుంచి 20 వేల మొక్కలను పెంచాలని భావిస్తున్నారు.