రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
సాగుకు ముందుకొచ్చే వారికి రాయితీలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వెయ్యి ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు
ఇప్పటికే జంబుగలో 315 మదర్ సీడ్ చెట్ల పెంపకం
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : సంప్రదాయ పంటలను వేస్తూ సరైన దిగుబడులు రాక, మద్దతు ధరలు లేక రైతులు ఎన్నో నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త రకం పంటలను వేసేవారికి రాయితీలను కల్పిస్తున్నది. యేటా రైతులు సంప్రదాయకంగా వేస్తున్న పంటలకు పెట్టుబడులు పెరిగిపోవడం, సరైన దిగుబడులు లేక ఇబ్బందులు పడడం పరిపాటిగా మారింది. ఇలాంటి రైతులకు అవగాహన కల్పించి ఒకేసారి పెట్టుబడి పెట్టి దీర్ఘకాలికంగా దిగుబడులను ఇచ్చే పంటలవైపు రైతులను ఆకర్షించేలా ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆయిల్పాం సాగుచేసే రైతులకు చేయూతనందించేందుకు చర్యలు తీసుకుంటున్నది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆయిల్పాం తోటలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. వర్షాభావ పరిస్థితులను తట్టుకొని రైతులకు లాభాలు తెచ్చే పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. ఆ దిశగా రాయితీలు కల్పించి ఆయిల్ తోటల అభివృద్ధికి చేయూతనందించనుంది. జిల్లాలోని ఆయిల్ తోటల పెంపునకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రైతులు ముందుకొస్తే సుమారు వెయ్యి ఎకరాల్లో ప్రాథమికంగా తోటలను అభివృద్ధి చేసేదిశగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో జంబుగాలో ఉన్న ఐటీడీఏ ఉద్యానవనంలో ఐదెకరాల ఆయిల్ సీడ్ మదర్ ప్లాంటేషన్ను అభివృద్ధి చేసింది. ఇందులో ఉన్న 315 చెట్లతో కూడిన ఆయిల్ ప్లాంట్లోని చెట్లు ఆరోగ్యంగా, ఇక్కడి వాతావరణాన్ని తట్టుకొని ఎదుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా అశ్వరావుపేట, దమ్మపేట్, జంగారెడ్డిగూడెంలో ఇప్పటికే ఆయిల్పాం తోటలున్నాయి.
అక్కడ ఉన్నట్లుగా ఆసిఫాబాద్ జిల్లాలోని వాతావరణ పరిస్థితులుండడంతో జిల్లాలో ఆయిల్ పాంల అభివృద్ధికి అనుకూల వాతావరణం, వర్షపాతం, నేలలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయిల్ క్రషింగ్ యూనిట్ను ఇక్కడ ఏర్పాటు చేయాలంటే కనీసం వెయ్యి ఎకరాల్లో ఆయిల్ పాం తోటలు ఉంటేనే సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మొక్కలు అందించడంతోపాటు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో డ్రిప్ ఇరిగేషన్, ఇతర వసతులు కల్పించనున్నారు. ఆయిల్ మొక్కలు ఐదేండ్ల తర్వాత పంటకు వస్తాయి. మొక్కలు నాటినప్పటి నుంచి నాలుగేండ్ల పాటు అధికారులు తోటలను ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తారు. రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు తోటల సస్యరక్షణకు చర్యలు చేపడుతారు. ప్రస్తుతం ఆయిల్ సీడ్ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవెగి వద్ద ఉంది. అక్కడ ఆయిల్ క్రషర్స్ ఉన్నాయి. మనదగ్గర రైతులు కూడా ముందుకొచ్చి కనీసం వెయ్యి ఎకరాల్లో సాగుచేస్తేనే ఫలితం ఉంటుంది.