వైన్షాప్ల్లో తనిఖీలతో గుట్టు బట్టబయలు
కేటుగాళ్లను పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు
శ్రీరాంపూర్, మే 13 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్టేషన్ పరిధిలో కల్తీ మద్య కేటుగాళ్ల గుట్టురట్టయింది. ఆర్కే 8 కాలనీలో పిట్టల సురేశ్ తన ఇంట్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు రామగుండం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్, పోలీసులు గురువారం సాయంత్రం దాడి చేశారు. అప్పుడే కల్తీ చేస్తున్న సుమారు రూ.78 వేల విలువైన మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. ఖాళీ మద్యం సీసాలు, మూతలు లభించగా స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ రాజ్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. పోలీసులకు అందిన సమాచారం మేరకు పిట్టల సురేశ్ ఇంటిపై దాడి చేశారు. అక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేస్తుండగా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. గోదావరిఖనికి చెందిన ఈర్ల శంకరయ్య బార్లో పని చేస్తూ ఉంటాడని, ప్రతిరోజూ బార్లో తీసిన మద్యం సీసాల మూతలను సేకరించి ఒక్కోటి రూ.20 చొప్పున తీసుకొని తనకు ఇస్తాడని చెప్పాడు. శ్రీరాంపూర్లో కల్తీ చేసిన మద్యాన్ని ఎక్కడ అమ్ముతారని ప్రశ్నించగా.. రోజుకు రూ.లక్ష కల్తీ మద్యం ఇందారం లక్ష్మీగణపతి వైన్షాప్కి సరఫరా చేస్తామని తెలిపాడు. వెంటనే సురేశ్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న రూ.78 వేల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించి కేసు నమోదు చేసినట్లు సీఐ కోటేశ్వర్, ఎస్ఐ మంగీళాల్ పేర్కొన్నారు.
ఇందారం లక్ష్మీగణపతి వైన్స్పై దాడి..
శ్రీరాంపూర్కు చెందిన పిట్టల సురేశ్ ఇచ్చిన సమాచారం మేరకు ఇందారంలోని లక్ష్మీగణపతి వైన్స్పై ఎక్సైజ్ శాఖ, టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అక్కడ కల్తీ మద్యం అమ్మకాలను గుర్తించారు. వైన్షాప్ తనిఖీల్లో రూ.66 వేల విలువైన నకిలీ మద్యాన్ని గుర్తించారు. అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ కోసం ఉపయోగిస్తున్న మెటీరియల్తో పాటు వైన్షాప్ను సీజ్ చేసినట్లు సీఐ రాజ్కుమార్ తెలిపారు. కల్తీ మద్యం ఆమ్మకాలు, తయారు చేస్తున్న వారిలో శ్రీరాంపూర్కు చెందిన పిట్టల సురేశ్, లక్ష్మీగణపతి వైన్స్ నిర్వాహకుడు బద్రి శ్రీకాంత్, గోదావరిఖని డాల్ఫిన్ బార్లో పని చేస్తున్న ఈర్ల కొమురయ్యను పట్టుకున్నారు. కల్తీ మద్యం అమ్మకాలను పట్టుకున్న ఎస్ఐ శేఖర్రెడ్డి, సంపత్, సదానందం శ్యామ్ను సీపీ సత్యనారాయణ అభినందించారు.