బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రంలో ఉచితంగా లభ్యం
మంచిర్యాల జిల్లాకు వచ్చిన ఇంజెక్షన్లు 356..
కొవిడ్ బాధితులకు ఇచ్చినవి 333..
ప్రైవేట్కు వెళ్లొద్దు.. : డాక్టర్ అనిల్ కుమార్
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న విప్, ఎంపీ, ఎమ్మెల్యేలు..
మంచిర్యాల, మే 9(నమస్తే తెలంగాణ) : రెమ్డెసివిర్.. కొవిడ్ పేషెంట్లకు ఊపిరి పోసే ఇంజెక్షన్. బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రంలో అందుబాటులో ఉండగా.. సర్కారు ఉచితంగా అందిస్తున్నది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి 356 రాగా.. వీటిలో 333 ఇచ్చి 62 మంది బాధితుల ప్రాణాలు కాపాడారు. మిగిలివని 23 ఉండగా.. వీటికి అదనంగా మరో 24 కూడా వచ్చాయి. సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు పొంది, వీటిని వినియోగించుకోవాలని డాక్టర్ అనిల్కుమార్ పేర్కొంటున్నారు. మరోవైపు విప్ సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్య ఎప్పటికప్పుడు కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తూ, వారి కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు.
కరోనా బాధితులకు సర్కారు మెరుగైన సేవలు అందిస్తున్నది. మంచిర్యాలలోని సర్కారు దవాఖాన, బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రం, పీహెచ్సీలలో చికిత్స అందిస్తున్నారు. రోజూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, వారికి మందులు ఇవ్వడం, అవసరమైన వారికి రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్ చేయడం చేస్తున్నారు. వ్యాధి లక్షణాలను బట్టి హోం ఐసొలేషన్, తీవ్ర లక్షణాలు ఉంటే బెల్లంపల్లి ఐసొలేషన్కు రెఫర్ చేస్తున్నారు. వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, ఆయాలు నిరంతరం కొవిడ్ వైద్యుల సేవలో ఉంటున్నారు. మరోవైపు వైద్య సిబ్బంది టీకాలు కూడా ఇస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో గర్భిణులకు ఆపరేషన్లు చేయకుంటే.. సర్కారు వైద్యులే ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్నారు. తల్లిబిడ్డలు బిడ్డలు ఇంటికి క్షేమంగా చేరే వరకు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సరిపడా బెడ్స్, ఆక్సిజన్, మందులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రైవేట్కు వెళ్తే జేబులు ఖాళీ..
కరోనా పేషెంట్లు చాలా మంది భయపడి ప్రైవేట్కు పరుగులు పెడుతున్నారు. సర్కారు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రైవేట్, సర్కారులో అయినా అదే వైద్యం ఉంటుందని సూచించినా ప్రాణభయంతో వెళ్తున్నారు. వారం, పది రోజులు చికిత్స తీసుకొని ఆర్థికంగా చితికిపోయి కొనఊపిరితో సర్కారు దవాఖానలకు వస్తున్నారు. సీరియస్గా ఉన్న కొవిడ్ రోగులకు ఇచ్చే ఇంజెక్షన్కు నానా యాతన పడుతున్నారు. ఒకవేళ దొరికినా సదరు హాస్పిటల్ వారు సూచించిన ధరకే కొనుగోలు చేసి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని మంచిర్యాల జిల్లాకేంద్రంలోని కొన్ని ప్రైవేట్ దవాఖానలు ఇంజెక్షన్లు, మందుల పేరిట బాధిత కుటుంబీకుల నుంచి అందినకాడికీ దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. బాధితులు ప్రైవేట్కు వెళ్లకుండా సర్కారు దవాఖాన సేవలను వినియోగించుకుంటే ప్రాణం, ఆస్తి కాపాడుకున్న వారవుతారు.
ఇంజెక్షన్లకు కొరతలేదు..
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఐసొలేషన్ సెంటర్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 356 ఇంజెక్షన్లు వచ్చాయి. జిల్లాకు ఏప్రిల్ వరకు 239 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు వచ్చాయి. తర్వాత మూడు దఫాలుగా 117 వచ్చాయి. వీటిలో 62 మందికి 333 ఇంజెక్షన్లు ఇవ్వగా. మిగతా 23 ఉన్నాయి. కొత్తగా 24 వచ్చాయి. ప్రభుత్వం మాత్రం రెమ్డెసివిర్ ఇంజెక్ష న్లను ప్రజల కోసం ఉచితంగా అందజేస్తున్నది.బెల్లంపల్లి ఐసొలేషన్లో మెరుగైన వైద్యం అందిస్తున్నా మని, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయని, కొవిడ్ పేషెంట్లు ప్రైవేట్కు కాకుండా నేరుగా సర్కారు దవాఖానకు వస్తే ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉందని బెల్లంపల్లి ఐసొలేషన్ ఇన్చార్జి డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.
పర్యవేక్షిస్తున్న విప్, ఎంపీ, ఎమ్మెల్యేలు
కరోనా బాధితుల యోగక్షేమాలు తెలుసుకుంటూ.. వారి కుటుంబాలకు విప్ సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్రావు, చిన్నయ్యలు భరోసా ఇస్తున్నారు. ఏ రాత్రి ఫోన్ చేసినా స్పందిస్తూ వారి చికిత్సలకు సంబంధించిన సలహాలు, సూచనలతోపాటు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. రెమెడెసివర్ విషయమై సీఎంవోతో ఫాలో అప్ చేస్తున్నారు. అవసరమైన మందులు సరఫరా చేస్తుండడంతోపాటు వారికి మనోధైర్యం ఇస్తున్నారు.