రుణాల పంపిణీలో రాష్ట్రంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు మొదటి స్థానం
ఉమ్మడి జిల్లాకు రూ. 324.8 కోట్ల రుణ లక్ష్యం
ఇప్పటికే ఈ నాలుగు నెలల్లో రూ. 29.68 కోట్లు పంపిణీ
13.59 శాతంతో అడవుల జిల్లా ముందంజ
ఆర్థికంగా బలపడుతున్న మహిళా సంఘాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) :రాష్ట్ర సర్కారు స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తూ మహిళా సంఘాలకు ఆర్థిక భరోసానిస్తున్నది. ఇందులో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ. 324.8 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రూ. 29.68 కోట్లు అందించింది. నిర్మల్ జిల్లాలో 9.03 శాతం, ఆదిలాబాద్లో 8.48 శాతం, మంచిర్యాల జిల్లాలో 7.88 శాతం పంపిణీ చేయగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మాత్రం 13.59 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇప్పటికే రుణాలు పొందిన మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
స్త్రీనిధి పథకం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వరంలా మారింది. ఆర్థికంగా ఎదగాలని ఆసక్తి ఉన్న వారికి ఇది దోహదపడుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహిళా సంఘాలకు రూ. 324.8 కోట్లు రుణాలుగా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు.. అంటే ఈ నాలుగు నెలల కాలంలో రూ. 29.68 కోట్లు అందించింది. నిర్మల్ జిల్లా లక్ష్యం రూ. 97.67 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ. 8.82 కోట్లు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.03 శాతం రుణాల పంపిణీ పూర్తయ్యింది. ఆదిలాబాద్ జిల్లా లక్ష్యం రూ. 43.18 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ. 3.66 కోట్లు అందించారు. 8.48 శాతం రుణాలు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా రుణ లక్ష్యం రూ. 136.45 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ. 10.75 కోట్లు అందించారు. 7.88 శాతం రుణాలు అందించారు.
మొదటి స్థానంలో ఆసిఫాబాద్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండల మహిళా సంఘాలు, 440 గ్రామైక్య సంఘాలు, 9796 స్వయం సహాయక సంఘాలు ఉండగా, మొత్తంగా 102352 మంది సభ్యులు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం రూ. 47.50 కోట్లు కాగా, ఈ నాలుగు నెలల్లో రూ. 6.45 కోట్లు అందించారు. ఈ లెక్కన 13.59 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. స్త్రీనిధి ద్వారా రుణాలను పొందిన మహిళలు వివిధ వ్యాపారాలు పెట్టుకొని ప్రతి నెలా రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు సంపాదిస్తున్నారు. ఆర్థిక అవసరాల్లో కుటుంబానికి కొండంత అండగా నిలుస్తున్నారు.
ఉపాధికి మంచి అవకాశం..
స్త్రీనిధి రుణాలు పొందడం, వాటి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించటంపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేదరికంలో మగ్గుతున్న మహిళలు తక్కువ వడ్డీకి రుణాలను పొంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటున్నారు.
రూ.50 వేల రుణంతో కిరాణా దుకాణం పెట్టాను
నేను స్త్రీనిధి ద్వారా రూ.50 వేల రుణం తీసుకున్నాను. కిరాణా వ్యాపారం చేస్తున్నా. నెలకు రూ.8 నుంచి రూ.10 వేల వరకు సంపాదిస్తున్నా. ఇంతకాలం ఇంటి వద్దే ఖాళీగా ఉండేదాన్ని. స్త్రీనిధి రుణాలు తీసుకొని ఏదైనా వ్యాపారం పెట్టాలని అధికారులు సూచించడంతో నేను ఈ వ్యాపారాన్ని ప్రారంభించాను. ఇప్పుడు నాకు ఒక ఉపాధి కలగడంతోపాటు మా ఇంటి అవసరాలు తీర్చుకునేందుకు ఆర్థికంగా కూడాఎంతో ఉపయోపడుతోంది.
రూ.12 వేల వరకు సంపాదిస్తున్నా..
స్త్రీనిధి రుణాలు మాకు ఎంతో ఉపయోపడుతున్నాయి. నేను రూ.లక్ష రుణాన్ని స్త్రీనిధి ద్వారా తీసుకున్నా. ఈ డబ్బుతో ఒక తోపుడు బండి తీసుకొని, దానిపై ఇండ్లలో వాడుకునే ప్లాస్టిక్ వస్తువులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇతర ఫ్యాన్సీ వస్తువులను హోల్సేల్గా కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించా. నెలకు రూ.12 వేల వరకు సంపాదిస్తున్నా.
రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నారు…
స్త్రీనిధి రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకుంటున్నారు. రుణం తీసుకున్న ప్రతి మహిళా ఏదో ఒక స్వయం ఉపాధిని కల్పించుకుంటున్నారు. జిల్లాకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.47.50 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ఉంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల కాలంలో రూ.5.60 కోట్ల రుణాలను అందించాం.