రామకృష్ణాపూర్, మే 3 : కరోనా విజృంభిస్తున్న కష్టకాలంలో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్న వ్యాధిగ్రస్థులను ఆదుకోవాలని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం రామకృష్ణాపూర్ రెస్క్యూ స్టేషన్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ రెస్క్యూ స్టేషన్ రెస్క్యూ ట్రైయిన్డ్ సభ్యులు 80 మంది రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కొవిడ్ 19 కరోనా రెండో వేవ్ కాలంలో జిల్లాలోని బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వల కొరత ఏర్పడిందని తెలిపారు. దీంతో తలసేమియా, సికిల్ సెల్ బారిన పడ్డ పిల్లలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
రాబోయే రోజుల్లో 18 ఏళ్ల వయస్సుగల వారికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తి రెండు నెలల వరకు రక్తదానం చేయవద్దని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకునే ముందే రక్తదానం చేయాలని కోరారు. ఈ శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రానికి అందజేస్తామని తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ సింగరేణి యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెస్క్యూ స్టేషన్ ఇన్చార్జి జక్కారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులు హనుమంతరావు, కాసర్ల రంజిత్కుమార్, రెస్క్యూ బ్రిగేడ్ మెంబర్స్ గణేశ్ రామన్, సంపత్, మనోహర్, కట్కూరి శ్రీనివాస్, తిరుమలరావు, చిరంజీవి, శ్రీధర్రెడ్డి, సదాశివం, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.