నార్నూర్, డిసెంబర్ 24 : సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మండల న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్, జడ్జి దుర్గారాణి అన్నారు. మండలంలోని ఖైరదట్వా గ్రామంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికులకు చట్టాలు కల్పించే రక్షణ, పాటించాల్సిన నియమాల గురించి వివరించారు. బాలలు, మహిళలు, అణ గారిన వర్గాల హక్కులు, రక్షణ కోసం ప్రభుత్వం పలు చట్టాలు తీసుకొచ్చిందని, చట్టపరమైన భద్రత కల్పిస్తున్నదన్నారు. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కనక సేవంత-ప్రభాకర్, నారింజిపటేల్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆదివాసులు చదువుకోవడంతోనే అభివృద్ధి చెందుతారని బోథ్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది పంద్రం శంకర్ అన్నారు. మండలంలోని లఖంపూర్(జీ) గ్రామంలో సర్పంచ్ కుమ్రం జంగు ఆధ్వర్యంలోఆదివాసీ గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో ఆదివాసులు విద్యతో పాటు అవసరమైన మోటార్ వెహికిల్, విద్యాహక్కు, బాలకార్మికుల నిర్మూలన, పెసా చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం న్యాయవాది శంకర్ను గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సార్మేడి ఆత్రం సోనేరావ్, పంచాయతీ కార్యదర్శి రవికిరణ్, గ్రామ పటేల్ ఆత్రం సుంగు, తుడుందెబ్బ బోథ్ మండల కార్యదర్శి దుర్వ విశ్వేశ్వర్రావ్, దేవరావ్, కారోబార్ ఆత్రం లక్ష్మణ్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.